Rohit Sharma | ముంబై: వచ్చేనెలలో అమెరికా, వెస్టిండీస్ వేదికలుగా జరగాల్సి ఉన్న టీ20 ప్రపంచకప్ కోసం బీసీసీఐ ఇటీవలే భారత జట్టును ప్రకటించగా అందులో నలుగురు స్పిన్నర్లను ఎంపికచేయడంపై వస్తున్న విమర్శలపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. టీమ్ ఎంపిక తర్వాత తొలిసారిగా రోహిత్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్తో కలిసి ముంబైలో పాత్రికేయులతో మాట్లాడుతూ.. ‘నేను వివరాల్లోకి వెళ్లదలుచుకోలేదు. కానీ నాకు నలుగురు స్పిన్నర్లు కావాలి. మేం వెస్టిండీస్లో చాలా క్రికెట్ ఆడాం. అక్కడ పరిస్థితులెలా ఉంటాయో మాకు అవగాహన ఉంది.
అక్షర్, జడేజా బ్యాట్తోనూ అదరగొడుతున్నారు. కుల్దీప్, చాహల్ స్పిన్నర్లుగా జట్టును బ్యాలెన్స్ చేస్తారు. నలుగురు స్పిన్నర్లను ఎందుకు తీసుకున్నామన్నది అమెరికాకు వెళ్లాక చెప్తా’ అని అన్నాడు. ప్రపంచకప్కు భారత్.. కుల్దీప్, చాహల్, జడేజా, అక్షర్ రూపంలో నలుగురు స్పిన్నర్లను తీసుకున్న విషయం తెలిసిందే. రింకూ సింగ్ను ఎంపిక చేయకపోవడంపై వస్తున్న విమర్శలపై చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పందిస్తూ.. జట్టు కూర్పులో భాగంగా రింకూ అవకాశం కోల్పోయాడే తప్ప అతడు చేసిన తప్పేమీ లేదని వివరణ ఇచ్చాడు.