Dinesh Chandimal : పొట్టి క్రికెట్లో విధ్వంసక ఇన్నింగ్స్లు ఆడుతున్నసూర్యకుమార్ యాదవ్ను వన్డేల్లో ఆడించాలని శ్రీలంక మాజీ కెప్టెన్ దినేశ్ చండీమాల్ అన్నాడు. నామమాత్రమైన మూడో వన్డేలో అతనికి అవకాశం ఇవ్వాలని కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్కు చండిమాల్ సలహా ఇచ్చాడు. ‘భారత జట్టు సూర్యను వన్డేల్లో ఆడించాలి. మిడిల్ ఓవర్లలో ఇలాంటి ఆటగాడు ఒకరు ఉండాలి. అతను 30 లేదా 50 రన్స్ కొట్టినా కూడా మ్యాచ్ స్వరూపాన్ని పూర్తిగా మార్చేయగలడు. సూర్య మిగతా బ్యాటర్ల కంటే ప్రత్యేకం. అతడు మెరుపు వేగంతో పరుగులు సాధిస్తుంటే ప్రత్యర్థి జట్టుకు దిక్కు తోచదు’ అని చండీమాల్ తెలిపాడు. శ్రీలంకతో రెండు వన్డేలకు సూర్య స్థానంలో శ్రేయస్ అయ్యర్ను తీసుకున్నారు. ఇండియా సిరీస్ సొంతం చేసుకోవడంతో బెంచ్కు పరిమితమైన సూర్యకు ఛాన్స్ దొరకనుంది. ఇప్పటివరకూ అతను 16 వన్డేలు మాత్రమే ఆడాడు. మూడో వన్డే జనవరి 15న తిరువనంతపురంలో జరగనుంది.
కెరీర్లో భీకర ఫామ్లో ఉన్న సూర్య తొలిసారి టెస్టు జట్టుకు ఎంపికయ్యాడు. ఆస్ట్రేలియా సిరీస్ తొలి రెండు టెస్టులకు ప్రకటించిన 17 మంది ఆటగాళ్లలో బీసీసీఐ అతనికి చోటు కల్పించింది. ఈ వరల్డ్ నంబర్ 1 ప్లేయర్ను టెస్టులకు సెలక్ట్ చేయాలని మాజీ క్రికెటర్ గౌతం గంభీర్తో పాటు పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. టీ20 వరల్డ్ కప్ నుంచి సూర్య చెలరేగి ఆడుతున్నాడు. శ్రీలంకతో టీ20 సిరీస్లో సెంచరీతో కదం తొక్కాడు. కెరీర్లో మూడో టీ20 శతకం నమోదు చేశాడు.