టోక్యో ఒలింపిక్స్లో అత్యుత్తమ ప్రదర్శన
టోక్యో ఒలింపిక్స్..భారత క్రీడా చరిత్రలో మరుపురాని సందర్భం. ప్రమాదకర కరోనా వైరస్ విజృంభణ కారణంగా ఏడాది ఆలస్యంగా మొదలైన విశ్వక్రీడల్లో భారత్ అసమాన ప్రదర్శనతో అదరగొట్టింది. గతానికి పూర్తి భిన్నంగా అందరి అంచనాలు తలక్రిందులు చేస్తూ పతకాలు కొల్లగొట్టింది. పంటిబిగువున నొప్పిని భరిస్తూ యువ వెయిట్లిఫ్టర్ మీరాబాయిచాను వెండి వెలుగులతో మొదలైన భారత పతక జోరు బల్లెం వీరుడు నీరజ్ చోప్రా పసిడి కాంతులతో ఘనంగా ముగిసింది. రవికుమార్ దహియా ఉడుం పట్టుకు రజతం దాసోహమైతే…వరుస విశ్వక్రీడల్లో పతకంతో పీవీ సింధు నయా చరిత్ర లిఖిస్తే..బరిలోకి దిగిన తొలిసారే లవ్లీనా బొర్గోహై తన పంచ్ పవర్ చూపించింది. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు భారత హాకీ జట్టు తెరదించితే..బాహుబలి బజరంగ్ పునియా కాంస్యంతో మువ్వన్నెల జెండాను రెపరెపలాడించాడు. అంతటితో ఆగకుండా పారాలింపిక్స్లోనూ మనోళ్లు అద్వితీయ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఏకంగా 19 పతకాలతో కొత్త చరిత్ర లిఖించారు. ఈ నేపథ్యంలో గతంలోకి ఓసారి తొంగిచూద్దాం పదండి.
టోక్యో ఒలింపిక్స్లో భారత అథ్లెట్లు అద్వితీయ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. కరోనా వైరస్ విజృంభణ కారణంగా ఏడాది ఆలస్యంగా ప్రేక్షకుల్లేకుండా కట్టుదిట్టమైన కరోనా ఏరాట్ల మధ్య విశ్వక్రీడలు గతానికి పూర్తి భిన్నంగా సాగాయి. ఒలింపిక్స్లో పతకం సాధిస్తే.. జీవితం ధన్యమైనట్లే అన్న రీతిలో వివిధ దేశాల అథ్లెట్లు పోటీపడిన తీరు నభూతో నభవిష్యత్. లండన్(2012) ఒలింపిక్స్ ప్రదర్శనను అధిగమిస్తూ ఈసారి మన అథ్లెట్లు పతకాల పంట పండించారు. స్వర్ణం సహా రెండు రజతాలు, నాలుగు కాంస్య పతకాలతో ఏడింటిని ఖాతాలో వేసుకుని ఔరా అనిపించింది. మరో రెండేండ్లలో జరుగనున్న పారిస్(2024) ఒలింపిక్స్లో పతకాల సంఖ్యను రెట్టింపు చేయాలని చూస్తున్న భారత్ అందుకు తగ్గట్లు ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నది. వెయిట్లిఫ్టర్ మీరాబాయి చాను అదిరిపోయే రీతిలో పతక బోణీ కొడితే..నీరజ్ చోప్రా స్వర్ణ పతకంతో టోక్యో గ్రాండ్గా వీడ్కోలు పలికిన తీరు కోట్లాది మంది క్రీడాభిమానుల మదిలో శాశ్వతంగా గుర్తుండిపోతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో.
భళా బల్లెం వీరుడు
విశ్వక్రీడల అథ్లెటిక్స్లో భారత్కు తొలి పతకాన్ని అందించిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా అద్భుత చరిత్ర లిఖించాడు. తనపై పెట్టుకున్న ఆశలను ఏమాత్రం వమ్ముచేయని నీరజ్..పసిడి పతకాన్ని ముద్దాడిన సందర్భం ప్రతి అభిమానికి కలకాలం గుర్తిండిపోతుంది. ఆది నుంచే ప్రత్యర్థులపై దీటైన పోటీనిస్తూ ముందుకు సాగిన నీరజ్ 86.65 మీటర్ల దూరం బల్లాన్ని విసిరి అగ్రస్థానాన్ని అధిరోహించాడు. ఓవైపు వాతావరణం అంతగా అనుకూలించకున్నా..వెనుకకు తగ్గని ఈ యువ అథ్లెట్..అభినవ్ బింద్రా తర్వాత ఒలింపిక్స్లో స్వర్ణం గెలిచిన రెండో భారతీయునిగా అరుదైన రికార్డు అందుకున్నాడు. టోక్యోలో అద్భుత ప్రదర్శనతో సొంతగ్డడపై అడుగుపెట్టిన చోప్రాకు అభిమానులు నీరాజనాలు పలికారు.
నాలుగున్నర దశాబ్దాల కల నెరవేరే
ఘన చరిత్ర కల్గిన భారత హాకీలో పూర్వ వైభవానికి టోక్యోలో అడుగులు పడ్డాయి. అవును నాలుగు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ జర్మనీతో కాంస్య పతక పోరులో టీమ్ఇండియా 5-4 తేడాతో చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆఖరి నిమిషం వరకు నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన పోరులో భారత అసమాన ప్రదర్శన కోట్లాది మంది భారతీయుల హృదయాలను కొల్లగొట్టింది. మరోవైపు మహిళల హాకీలో భారత్ నాలుగో స్థానంలో నిలిచి ఔరా అనిపించింది.
ఇదిలా ఉంటే రెజ్లింగ్లో రవికుమార్ దహియా రజతంతో మెరిశాడు. ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తుచేస్తూ ఈ హర్యానా రెజ్లర్ పోటీకి దిగిన తొలిసారే చరిత్ర లిఖించాడు. సెమీఫైనల్లో ప్రత్యర్థి బాక్సర్ నరాలు తెగేటట్లు కొరికినా..పంటి బిగువున నొప్పిని భరిస్తూ పతకాన్ని ఒడిసిపట్టుకున్నాడు. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన బజరంగ్ పునియా కాంస్యాన్ని దక్కించుకున్నాడు.
మీరా వెండి వెలుగులు
భారత యువ వెయిట్లిఫ్టర్ మీరాబాయి చాను చేతులు అద్భుతం చేశాయి. కోట్లాది మంది భారతీయుల ఆశలను వమ్ము చేయకుండా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగిన మీర తన సుదీర్ఘ కలను నెరవేర్చుకుంది. పోటీల తొలి రోజే భారత్కు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చింది. స్నాచ్లో 87కిలోల బరువెత్తిన ఈ మణిపూర్ మణిపూస..క్లీన్ అండ్ జర్క్లో 115కిలోలతో మొత్తంగా 202కిలోలు ఎత్తి రజత విజేతగా నిలిచింది. పతకం గెలిచిన సంబురంలో మీర పట్టరాని సంతోషంలో మునిగిపోయింది. తనతో కలిసి పటియాలలో ప్రాక్టీస్ చేసిన సహచరులతో తన విజయాన్ని ఆస్వాదించింది. తనదైన శైలిలో డ్యాన్స్ చేస్తూ గెలుపు సంబురాల్లో పాలుపంచుకుంది.
సింధు మళ్లీ మెరిసెన్
స్టార్ షట్లర్ పీవీ సింధు వరుస ఒలింపిక్స్లో పతకం సాధించిన తొలి భారత ప్లేయర్గా అరుదైన ఘనత సొంతం చేసుకుంది. రియో(2016)లో రజతం దక్కించుకున్న సింధు..టోక్యోలో కాంస్యాన్ని ఖాతాలో వేసుకుంది. చైనా షట్లర్ బింగ్జియావోతో పోరులో వరుస గేముల్లో గెలిచిన సింధు కాంస్య పతకాన్ని ముద్దాడింది. ఇదిలా ఉంటే ఫైనల్లో చైనా షట్లర్ చెన్ యుఫీ చేతిలో ఓడిన తైజు యింగ్కు సింధు మద్దతుగా నిలిచింది. ఓడిన బాధలోనూ తైజుకు ఓదార్పు అందించిన సింధు ప్రశంసలు దక్కించుకుంది.