అంచనాలను ఆకాశానికి చేరుస్తూ.. 49 ఏండ్ల తర్వాత ఒలింపిక్స్ సెమీఫైనల్లో అడుగుపెట్టిన భారత పురుషుల హాకీ జట్టు.. కీలక మ్యాచ్లో ప్రభావం చూపలేకపోయింది. ప్రపంచ నంబర్వన్ బెల్జియంతో జరిగిన పోరులో ఒత్తిడికి గురైన భారత ఆటగాళ్లు.. ప్రత్యర్థికి పదే పదే పెనాల్టీ కార్నర్ అవకాశాలిచ్చి.. అందుకు తగ్గ మూల్యం చెల్లించుకున్నారు. రెజ్లింగ్లో సోనమ్ కపూర్ ఆకట్టుకోలేకపోగా.. ఫేవరెట్గా బరిలోకి దిగిన షార్ట్పుటర్ తజిందర్పాల్ సింగ్ తూర్ క్వాలిఫయర్స్లోనే ఇంటిబాట పట్టాడు. మహిళల హాకీ సెమీఫైనల్లో నేడు రాణి రాంపాల్ సేన అర్జెంటీనాతో తలపడనుండగా.. జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు!
టోక్యో: దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత ఒలింపిక్స్ సెమీఫైనల్కు చేరిన భారత పురుషుల హాకీ జట్టు.. కీలక పోరులో ఒత్తిడిని జయించలేక పరాజయం వైపు నిలిచింది. మంగళవారం జరిగిన సెమీస్లో భారత్ 2-5తో ప్రపంచ చాంపియన్ బెల్జియం చేతిలో ఓడింది. మాస్కో (1980) ఒలింపిక్స్ తర్వాత హాకీలో ఒక్క పతకం కూడా సాధించలేకపోయిన భారత్.. గురువారం కాంస్య పతక పోరులో జర్మనీతో అమీతుమీ తేల్చుకోనుంది. సెమీస్ తొలి మూడు క్వార్టర్స్లో చక్కటి ప్రదర్శన కనబర్చిన మన్ప్రీత్ సింగ్ సేన.. చివరి క్వార్టర్లో పట్టు సడలించింది. భారత్ తరఫున హర్మన్ప్రీత్ సింగ్ (7వ నిమిషంలో), మన్దీప్ సింగ్ (8వ ని) చెరో గోల్ చేయగా.. ప్రత్యర్థి జట్టు తరఫున అలెగ్జాండర్ హెండ్రిక్స్ (19వ, 49వ, 53వ నిమిషాల్లో) హ్యాట్రిక్ బాదగా.. లూయిపార్ట్ (2వ ని), జాన్ డామెన్ (60వ ని) చెరో గోల్ కొట్టారు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో భారత్కు 5 పెనాల్టీ అవకాశాలు రాగా.. సర్కిల్లో మనవాళ్ల తప్పుల కారణంగా ప్రత్యర్థికి 14 చాన్స్లు దక్కాయి. నాకౌట్ మ్యాచ్లు ఆడటంలో ఆరితేరిన బెల్జియం ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయగా.. ఆరంభంలో ఆకట్టుకొని.. ఆఖర్లో పట్టు సడలించే అలవాటును కొనసాగించిన భారత్ అందుకు తగ్గ మూల్యం చెల్లించుకుంది.
మ్యాచ్ ఆరంభమైన రెండో నిమిషంలోనే పెనాల్టీ కార్నర్ అవకాశం దక్కించుకున్న బెల్జియం ఆటగాళ్లు గోల్ కొట్టి ఆధిక్యంలో నిలువగా.. రెండు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్తో మనవాళ్లు దీటుగా బదులిచ్చారు. ఏడో నిమిషంలో పెనాల్టీ కార్నర్ను హర్మన్ప్రీత్ సింగ్ గోల్గా మలువగా.. మరో రెండు నిమిషాలకే మన్దీప్ రివర్స్ హిట్ ద్వారా చక్కటి ఫీల్డ్గోల్తో ఆధిక్యాన్ని పెంచాడు. తొలి క్వార్టర్లోనే భారత్కు మరో పెనాల్టీ అవకాశం దక్కినా రూపిందర్ పాల్ సింగ్ సఫలీకృతం కాలేకపోయాడు. రెండో క్వార్టర్ ఆరంభంలో మరో గోల్ కొట్టిన బెల్జియం స్కోరు సమం చేసింది. ఇక అక్కడి నుంచి ఇరు జట్లు హోరాహోరీగా పోరాడటంతో మరో గోల్ నమోదు కాలేదు. చివరి క్వార్టర్ వరకు అంతా సజావుగానే సాగినా.. ఆఖర్లో ఒత్తిడికి లోనైన భారత ఆటగాళ్లు ప్రత్యర్థికి వరుస పెనాల్టీ కార్నర్లు సమర్పించుకున్నారు. 49వ నిమిషంలో బెల్జియంకు వరుసగా మూడు పెనాల్టీ కార్నర్ అవకాశాలు రాగా.. అందులో ఒకదాన్ని గోల్గా మలచగలిగింది. దీంతో లీడ్లోకి వెళ్లిన బెల్జియం పదే పదే భారత గోల్పోస్ట్ దాడులు చేస్తూ.. మనవాళ్లను ఒత్తిడిలో పడేసింది. ఈ క్రమంలో పెనాల్టీ స్ట్రోక్ సాధించిన బెల్జియం స్కోరు డబుల్ చేసుకోగా.. ఆట చివరి నిమిషంలోనూ ఆ జట్టు ఓ గోల్ కొట్టి వరుసగా రెండో ఒలింపిక్స్ ఫైనల్లో అడుగుపెట్టింది.
ఈ పోరులో బెల్జియం చేతిలో భారత్ ఓడిందనే దాని కంటే.. ఒత్తిడి చేతిలో చిత్తైంది అనడమే సమంజసమేమో! చాన్నాళ్ల తర్వాత ఒలింపిక్స్లో కీలక మ్యాచ్ ఆడుతున్న భారత ఆటగాళ్లు తీవ్ర ఒత్తిడిలో కనిపించారు. 60 నిమిషాల పోరులో ప్రత్యర్థికి ఏకంగా 14 పెనాల్టీ కార్నర్ అవకాశాలు ఇచ్చారంటేనే మనవాళ్ల ఆట ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఒకానొక దశలో బెల్జియం ఆటగాళ్లు స్కోరు చేయడాన్ని పక్కనపెట్టి.. కేవలం భారత సర్కిల్లో ప్రవేశించి పెనాల్టీ కార్నర్ అవకాశాలను సృష్టించుకోవడమే పనిగా పెట్టుకున్నట్లు కనిపించారు. బెల్జియం ఖాతాలో చేరిన ఐదు గోల్స్లో నాలుగు పెనాల్టీల ద్వారా వచ్చినవే కావడం గమనార్హం.
విశ్వక్రీడల రెజ్లింగ్ తొలి రోజు భారత్కు కలిసి రాలేదు. మంగళవారం భారత్ తరఫున టోక్యో బరిలోకి దిగిన తొలి రెజ్లర్ సోనమ్ మాలిక్.. ఖురెల్ఖూ (మంగోలియా) చేతిలో ఓటమి పాలైంది. 62 కేజీల విభాగంలో పోటీపడిన 19 ఏండ్ల సోనమ్ మ్యాట్పై ఆకట్టుకున్నా.. ఖురెల్ఖూ అనుభవం ముందు నిలువలేకపోయింది. 2-2తో స్కోరు సమమైనా..రిఫరీలు మంగోలియా రెజ్లర్ను విజేతగా ప్రకటించడంతో సోనమ్ నిరాశగా వెనుదిరిగింది.
ఒలింపిక్స్లో భారత అథ్లెట్ల పేలవ ప్రదర్శన కొనసాగుతున్నది. ఇదివరకే ముగిసిన ట్రాక్ అండ్ ఫీల్డ్, డిస్కస్ త్రో ఈవెంట్లలో పతక అశలు కల్పించిన ఆటగాళ్లు ఫైనల్లో తేలిపోగా తాజాగా షాట్పుట్, జావెలిన్ త్రోలోనూ మన అథ్లెట్లు నిరాశపరిచారు. మంగళవారం జరిగిన ఈ పోటీలలో పాల్గొన్న తజిందర్పాల్ సింగ్, అన్ను రాణి ఫైనల్స్కు అర్హత సాధించలేకపోయారు.
మంగళవారం పురుషుల షాట్పుట్లో తజిందర్పాల్ సింగ్ గుండును 19.99 మీటర్ల దూరం విసిరాడు. ఈ క్రమంలో వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన (21.49 మీటర్లు)ను కూడా తజిందర్ చేరుకోలేకపోయాడు. మహిళల జావెలిన్త్రో క్వాలిఫయింగ్ రౌండ్లో అన్నురాణి 54.04 మీటర్లు విసిరి నిరాశపరిచింది.
మానసిక కుంగుబాటుతో సతమతమవుతున్న వరల్డ్ నంబర్వన్ జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్ ఒత్తిడిని జయిస్తూ తన ట్రేడ్మార్క్ ప్రదర్శనతో అలరించింది. మంగళవారం జరిగిన బ్యాలెన్స్ బీమ్ ఫైనల్లో బైల్స్ తృటిలో అగ్రస్థానాన్ని కోల్పోయి మూడో ప్లేస్లో నిలిచింది. 14 పాయింట్లతో బైల్స్ కాంస్యం దక్కించుకుంది. వారం రోజుల క్రితం పోటీ మధ్యలోనే తప్పుకుని అందరినీ ఆశ్చర్యపరిచిన బైల్స్.. బీమ్ ఫైనల్స్లో ఆకట్టుకుంది. తాజా పతకంతో ఒలింపిక్స్లో ఆమె పతకాల సంఖ్య 7కు చేరింది.
ఒలింపిక్స్ లాంగ్జంప్ పోటీలలో రెండు దశాబ్దాలుగా స్వర్ణం కోసం వేచిచూస్తున్న జర్మనీ కలను మలైకా మిహాం బో నెరవేర్చింది. టోక్యోలో మంగళవారం జరిగిన మహిళల లాంగ్జంప్లో ఆమె 7 మీటర్లు దూకి ఆ దేశానికి పసిడి కరువును తీర్చింది. జర్మనీ అథ్లెటిక్స్ లెజెండ్ డ్రెచ్స్లర్ సిడ్నీ(2000) ఒలింపిక్స్లో స్వర్ణం సాధించిన తర్వాత ఆ దేశం లాంగ్జంప్లో మళ్లీ పసిడిని ముద్దాడలేదు. మిహాంబో అద్భుత విజయంపై డ్రెచ్స్లర్ ప్రశంసలు కురిపించింది. ఈ పోటీలో రీస్ (అమెరికా, 6.97 మీ.), బ్రూమ్ (నైజీరియా, 6.97 మీ.) వరుసగా రజత, కాంస్యాలు గెలుచుకున్నారు.
ఎవరి రికార్డును వాళ్లే బద్దలు కొట్టుకుంటే వచ్చే మజానే వేరు. పరుగు పందాల్లో ఇది మరీను. సెకన్ల తేడాతో ఫలితం మారే రేసుల్లో సత్తాచాటితే ఆ కిక్కు మామూలుగా ఉండదు. మంగళవారం జరిగిన పురుషుల 400మీటర్ల హర్డిల్స్ రేసులో నార్వే స్ప్రింటర్ కార్సెన్ వార్హోమ్ సత్తాచాటాడు. చిరుతను తలపిస్తూ రేసును 45.94 సెకన్లలో ముగిం చి తన పేరిటే ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. గతంలో 46.70 సెకన్లలో గమ్యాన్ని ముద్దాడిన రికార్డు వార్హోమ్ పేరిట ఉంది. ఈ రేసులో బెంజిమన్ (46.17సె), అలిసన్ (46.72సె) వరుసగా రజత, కాంస్యాలు నెగ్గారు.
విశ్వక్రీడల్లో అమెరికా నల్లకలువ అతింగ్ మూ సంచలన ప్రదర్శన చేసింది. మహిళల 800 మీటర్ల పరుగు పందెంలో అమెరికా 53 ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. మంగళవారం జరిగిన రేసును 1:55:21సెకన్లలో ముగించి దేశానికి స్వర్ణాన్ని అందించింది. దీని ద్వారా 1968 మెక్సికో ఒలింపిక్స్లో మ్యాడిలైన్ మ్యానింగ్ పసిడి ప్రదర్శన తర్వాత అతింగ్ ఈ ఫీట్ను పునరావృతం చేసి రికార్డుల్లోకెక్కింది. ఇదే పోటీలో హడ్స్కిన్సన్(బ్రిటన్), రోజర్స్(అమెరికా) రజత, కాంస్యాలు దక్కించుకున్నారు. న్యూజెర్సీకి చెందిన మూ.. ఇటీవలే కాలేజీ విద్యను పూర్తి చేసుకుని జూన్లోనే ప్రొఫెషనల్ రన్నర్గా గుర్తింపు పొంది అనతికాలంలోనే విశ్వ క్రీడలలో బంగారు పతకాన్ని సాధించడం గమనార్హం. అతింగ్ తల్లిదండ్రులు సూడాన్ సివిల్వార్ అనంతరం అమెరికాకు తరలివెళ్లారు.