హార్సెన్స్ (డెన్మార్క్): ప్రతిష్టాత్మక థామస్ కప్ గెలిచి మరోసారి చరిత్ర సృష్టించేందుకు భారత బ్యాడ్మింటన్ జట్టు మరో అడుగు ముందుకేసింది. రెండు మ్యాచ్ పాయింట్లు కాపాడుకుంటూ ప్రపంచ ఆరో ర్యాంకర్ చౌ టైన్ చెన్ కు లక్ష్యసేన్ చెక్ పెట్టిన వేళ చైనీస్ తైపీని చిత్తుగా ఓడించిన భారత్ సెమీఫైనల్ దూసుకెళ్లింది. మెగా టోర్నీలో పతకం ఖాయం చేసుకొని టైటిల్కు రెండు అడుగుల దూరంలో నిలిచింది. శుక్రవారం ఏకపక్షంగా సాగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ 3-0తో చైనీస్ తైపీపై ఘన విజయం సాధించింది. తొలి సింగిల్స్లో అద్భుత పోరాటపటిమ కనబరిచిన లక్ష్యసేన్ 18-21, 22-20, 21-17తోతన కంటే మెరుగైన ర్యాంకర్ చౌ టైన్ చెన్ కు చెక్ పెట్టాడు.
హోరాహోరీగాసాగిన మారథాన్ పోరులో తొలి గేమ్ కోల్పోయిన సేన్ రెండోగేమ్లో13-17తో వెనుకంజలో నిలిచిన దశలోఅద్భుతంగా పుంజుకున్నాడు. వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి స్కోరు సమం చేశాడు. తర్వాత జోరు పెంచిన చౌ టైన్ రెండు మ్యాచ్ పాయింట్లపై నిలిచాడు. తీవ్ర ఒత్తిడిలో మెరుగైన ప్రదర్శన చేస్తూ గేమ్ నెగ్గిన సేన్ నిర్ణాయక గేమ్లో ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. డబుల్స్ లో 4వ ర్యాంకర్ సాత్విక్-చిరాగ్ 23-21,19-21, 21-12తో చియు సియంగ్-వాంగ్ చిన్ లిన్ ను ఓడించింది. ఆపై రెండో సింగిల్స్ లో 20 ఏళ్ల యువ సంచలనం ఆయుష్ 21-16,21-17తో వరుస గేమ్స్లో ప్రపంచ 8వ ర్యాంకర్, ఆల్ ఇంగ్లండ్ చాంప్ లిన్ చున్ యిపై సంచలన విజయం సాధించడంతో భారత్ సెమీఫైనల్ చేరుకుంది.