సిరీస్ ప్రారంభానికి ముందు బీరాలు పలికిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు తొలి టెస్టులో తేలిపోయారు. అశ్విన్ను ఎదుర్కొనేందుకు తమ వద్ద సరైన ప్రణాళికలు ఉన్నాయన్న కంగారూలు రెండో ఇన్నింగ్స్లో కనీసం ఒక సెషన్ పాటు కూడా క్రీజులో నిలువ లేకపోయారు. భారత స్పిన్ ఉచ్చులో చిక్కుకొని విలవిలలాడారు. అశ్విన్ ఐదు వికెట్లతో ఆసీస్ను అల్లాడిస్తే.. జడ్డూ, షమీ అతడికి సహకరించారు. ఫలితంగా తొలి టెస్టులో ఘనవిజయం సాధించిన టీమ్ఇండియా.. అటు ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్తో పాటు ఇటు ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి చేరువైంది.
నాగ్పూర్: ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన టీమ్ఇండియా.. బోర్డర్-గవాస్కర్ సిరీస్లో బోణీ కొట్టింది. నాలుగు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇక్కడ జరిగిన తొలి టెస్టులో రోహిత్ సేన ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తుచేసింది. మూడు రోజుల్లోపే ముగిసిన మ్యాచ్లో కంగారూలు కనీస పోరాటం కనబర్చలేకపోయారు. స్టార్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (5/37) ధాటికి ఆసీస్ రెండో ఇన్నింగ్స్లో 91 పరుగులకే ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (25 నాటౌట్) టాప్ స్కోరర్ కాగా.. డేవిడ్ వార్నర్ (10), లబుషేన్ (17), కారీ (10) మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు.
భారత బౌలర్లలో జడేజా, షమీ చెరో రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 321/7తో శనివారం మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 400 పరుగులకు ఆలౌటైంది. ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (70) క్రితం రోజు స్కోరుకు మరో నాలుగు పరుగులు జతచేసి వెనుదిరగగా.. అక్షర్ పటేల్ (84; 10 ఫోర్లు, ఒక సిక్సర్) జట్టుకు భారీ స్కోరు అందించాడు. ఆఖర్లో మహమ్మద్ షమీ (37; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) విలువైన పరుగులు జోడించాడు.
ఆస్ట్రేలియా బౌలర్లలో అరంగేట్ర ఆటగాడు టాడ్ మార్ఫె 7 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. ఈ విజయంతో టీమ్ఇండియా 1-0తో సిరీస్లో ముందంజ వేసింది. రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి 7 వికెట్లు పడగొట్టడంతో పాటు 70 పరుగులు చేసిన జడేజాకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య శుక్రవారం నుంచి ఢిల్లీలో రెండో టెస్టు ప్రారంభం కానుంది.
మరో ముందడుగు..
ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ బెర్త్ దక్కించుకునే దిశగా టీమ్ఇండియా మరో ముందడుగు వేసింది. ఈ విజయంతో డబ్ల్యూటీసీ పట్టికలో భారత్ గెలుపు శాతం 61.67కు పెరిగింది. ‘బోర్డర్-గవాస్కర్’ సిరీస్లో మరో మూడు మ్యాచ్లు మిగిలుండగా.. వాటిలో రెండింట రోహిత్ సేన విజయం సాధిస్తే ఫైనల్ బెర్త్ ఖరారు అయినట్లే.
జడేజాకు జరిమానా
భారత స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాపై ఐసీసీ జరిమానా విధించింది. ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గానూ అతడి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించడంతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ కేటాయించారు. తొలి ఇన్నింగ్స్ సందర్భంగా అంపైర్ అనుమతి లేకుండా జడేజా ఎడమచేతి చూపుడు వేలుకు అయింట్మెంట్ పూసుకున్నాడు. ఈ వీడియాలో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా.. వేలికి ఉన్న వాపు కారణంగానే అయింట్మెంట్ రాసుకున్నాడని భారత జట్టు యాజమాన్యం స్పష్టతనిచ్చింది.
సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ టెస్టు సిక్సర్లలో రన్మెషీన్ విరాట్ కోహ్లీని అధిగమించాడు. సుదీర్ఘ ఫార్మాట్లో కోహ్లీ 24 సిక్స్లు బాదగా.. తాజా పోరులో షమీ (25) అతడిని దాటేశాడు. కేఎల్ రాహుల్, యువరాజ్ సింగ్, చతేశ్వర్ పుజారా కూడా షమీ కంటే వెనుకే ఉండటం గమనార్హం.
సంక్షిప్త స్కోర్లు
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 177, భారత్ తొలి ఇన్నింగ్స్: 400 (రోహిత్ 120; అక్షర్ 84; టాడ్ మార్ఫే 7/124), ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 91 ఆలౌట్ (స్మిత్ 25 నాటౌట్; అశ్విన్ 5/37, షమీ 2/13).