టోక్యో: జపాన్ రాజధాని టోక్యో మనకు బాగా కలిసొచ్చింది. మన ఆటలకు ఓ కొత్త ఊపునిచ్చింది. ఒలింపిక్స్లో మన అథ్లెట్లు సరికొత్త చరిత్ర సృష్టించిన విషయం తెలుసు కదా. 7 మెడల్స్తో ఒక ఒలింపిక్స్లో అత్యధిక మెడల్స్ గెలిచిన రికార్డును ఇండియన్ అథ్లెట్లు సృష్టించారు. లండన్ గేమ్స్ (6 మెడల్స్) రికార్డు బద్ధలైంది. ఇప్పుడు పారాలింపియన్లు కూడా అదే రూట్లో వెళ్లారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 19 మెడల్స్ గెలిచారు. చివరి రోజు బ్యాడ్మింటన్లో ఓ గోల్డ్, ఓ సిల్వర్ మెడల్ వచ్చాయి. టోక్యో పారాలింపిక్స్( Tokyo Paralympics )కు ముందు ఇండియా ఒక పారాలింపిక్స్లో సాధించిన అత్యధిక మెడల్స్ 12 మాత్రమే.
ఇప్పుడు అంతకంటే చాలా ఎక్కువ మెడల్స్ సొంతం చేసుకున్నారు. అంతేకాదు ఇందులో ఐదు గోల్డ్ మెడల్స్ కూడా ఉన్నాయి. ఈసారి కూడా మన పారా అథ్లెట్లు అంచనాలకు తగినట్లుగా రెండంకెల మెడల్స్ తీసుకొస్తారని ముందే ఊహించినా.. ఈ స్థాయి ప్రదర్శన మాత్రం ఆశ్చర్యం కలిగించేదే. ఈ రికార్డు మెడల్స్లో ఎన్నో కళ్లు చెదిరే ప్రదర్శనలు ఉన్నాయి.
అవని లెఖారా.. ఏకైక ఇండియన్
షూటింగ్లో అవని లెఖారా ఈసారి ఇండియా తరఫున తొలి గోల్డ్ మెడల్ సాధించింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్లో ఆమె తొలి స్థానంలో నిలిచింది. గతంలో ఏ భారతీయ మహిళా పారాఅథ్లెట్ కూడా గోల్డ్ సాధించలేదు. ఇదే ఓ అద్భుతమైన రికార్డు అనుకుంటే.. 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్లో బ్రాంజ్ గెలిచి మరో చరిత్ర సృష్టించింది. ఇండియా తరఫున ఒకే పారాలింపిక్స్లో రెండు మెడల్స్ గెలిచిన వ్యక్తి మరొకరు లేరు.
రికార్డులు వీళ్లవే..
ఇండియా సాధించిన మొత్తం 19 మెడల్స్లో 5 గోల్డ్ కాగా.. మరో 8 సిల్వర్, 6 బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి. ఈ మెడల్స్లోనూ మనవాళ్లు కొన్ని కొత్త రికార్డులు సృష్టించారు.
ఇండియా ఈసారి పారాలింపిక్స్కు గతంలో ఎన్నడూ లేని విధంగా 54 మంది పారా అథ్లెట్లును పంపించింది. వీళ్లు 9 క్రీడల్లో పాల్గొన్నారు. తొలిసారి బ్యాడ్మింటన్, తైక్వాండో టోక్యో పారాలింపిక్స్లో ఎంట్రీ ఇచ్చాయి. 1968లో తొలిసారి పారాలింపిక్స్లో పాల్గొన్న ఇండియా.. 2016 రియో పారాలింపిక్స్లో 12 మెడల్స్ సాధించింది. ఆ రికార్డును ఇప్పుడు అధిగమించింది. మొత్తం 162 దేశాలు పాల్గొన్న ఈ గేమ్స్లో 19 మెడల్స్తో ఇండియా 24వ స్థానంలో నిలిచింది.
మెడల్స్ సాధించింది వీళ్లే
గోల్డ్ మెడల్స్ సాధించిన వాళ్లలో. అవని లెఖారా (షూటింగ్), ప్రమోద్ భగత్ (బ్యాడ్మింటన్), కృష్ణ నగార్ (బ్యాడ్మింటన్), సుమిత్ అంటిల్ (జావెలిన్ త్రో), మనీష్ నర్వాల్ (షూటింగ్).
సిల్వర్ మెడల్స్ సాధించిన వాళ్లలో.. భవీనాబెన్ పటేల్ (టేబుల్ టెన్నిస్), సింఘ్రాజ్ (షూటింగ్), యోగేశ్ కథూనియా (డిస్కస్ త్రో), నిషాద్ కుమార్ (హైజంప్), మరియప్పన్ తంగవేలు (హైజంప్), ప్రవీణ్కుమార్ (హైజంప్), దేవేంద్ర ఝఝారియా (జావెలిన్ త్రో), సుహాస్ యతిరాజ్ (బ్యాడ్మింటన్).
బ్రాంజ్ మెడల్స్ గెలిచిన వాళ్లలో.. అవని లెఖారా (షూటింగ్), హర్విందర్ సింగ్ (ఆర్చరీ), శరద్కుమార్ (హైజంప్), సుంద్ సింగ్ గుర్జార్ (జావెలిన్ త్రో), మనోజ్ సర్కార్ (బ్యాడ్మింటన్), సింఘ్రాజ్ (షూటింగ్).
ఈసారి అత్యధికంగా అథ్లెటిక్స్లో 8 మెడల్స్ రాగా.. షూటింగ్లో 5, బ్యాడ్మింటన్లో 4, ఆర్చరీ, టేబుల్ టెన్నిస్లలో ఒక్కో మెడల్ వచ్చింది. ఆర్చరీ, టేబుల్ టెన్నిస్లలో ఇండియా మెడల్స్ గెలవడం ఇదే తొలిసారి కావడం విశేషం.