Lords ODI : వెస్టిండీస్ దిగ్గజం గ్యారీ సోబర్స్ (Garry Sobers) మృతితో క్రీడాలోకం విచారంలో మునిగిపోయిన విషయం తెలిసిందే. అనారోగ్య సమస్యలతో బాధ పడుతూ స్వగృహంలో కన్నుమూసిన ఆయనకు లార్డ్స్ (Lords) మైదానంలో నివాళులు అర్పించారు. ఆదివారం మూడో వన్డేకు ముందు భారత్, ఇంగ్లండ్ ఆటగాళ్లు మైదానంలో సోబర్స్ గౌరవార్థం ఒక నిమిషం మౌనం పాటించారు. టెస్టుల్లో వెటరన్ ఆల్రౌండరైన అతడిని తలచుకుంటూ.. ఇరుదజట్ల ప్లేయర్లు చేతికి నల్ల రిబ్బన్లు ధరించారు.
క్రికెట్ ప్రపంచమంతా గ్యారీ సోబర్స్ను తలచుకుంటోంది. ఆటపై చెరగని ముద్ర వేసిన అతడి సేవల్ని వేనోళ్ల కొనియాడుతోంది. శుక్రవారం జూలై 17న మరణించిన సోబర్స్కు క్రీడాలోకం నివాళులర్పిస్తోంది. లార్డ్స్లో భారత్, ఇంగ్లండ్ మధ్య మూడో వన్డేకు ముందు ఇరుజట్ల ఆటగాళ్లు.. ఈ దివంగత ఆటగాడి మృతిపట్ల విచారం వ్యక్తం చేశారు. అతడి ఆత్మకు శాంతి చేకూరాలని ఒక నిమిషం మౌనం వహించారు. ఈ సమయంలోనే బిగ్ స్క్రీన్ మీద సోబర్స్ ఫొటోను ప్రదర్శించారు. అనంతరం ఇంగ్లండ్ బ్యాటింగ్ ప్రారంభమైంది. చెరొక వన్డే గెలవడంతో ఈ మ్యాచ్లో నెగ్గిన జట్టే సిరీస్ను దక్కించుకోనుంది.
A minute’s silence was observed at Lord’s in honour of the late Sir Garry Sobers pic.twitter.com/mCz8yNq2RQ
— Cricinfo (@cricinfo) July 19, 2026
మేటి ఆల్రౌండర్గా ప్రసిద్ధి చెందిన సోబర్స్ 89 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచాడు. శుక్రవారం బార్బడోస్లోని స్వగృహంలో సోబర్స్ ప్రాణాలు విడిచాడు. గాడ్ గిఫ్డెడ్ క్రికెటర్గా కితాబులందుకున్న ఆయన మృతి పట్ల వెస్టిండీస్ క్రికెట్ సంతాపం తెలిపింది. ఒక గొప్ప ఇన్నింగ్స్ ముగిసింది. ‘ఇప్పుడే కాదు ఎప్పటికీ మా హృదయాల్లో ఉండిపోతారు..గ్యారీ సోబర్స్’ అని వెస్టిండీస్ క్రికెట్ పోస్ట్ పెట్టింది. సునీల్ గవాస్కర్, సచిన్, కోహ్లీ.. సహా పలువురు ఆటగాళ్లు సోబర్స్ మృతిపట్ల సంతాపం తెలిపారు.
ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16 ఏళ్లకే అడుగుపెట్టిన గ్యారీ సోబర్స్.. ఆ తర్వాత ఏడాదికే టెస్టు జట్టులోకి చ్చాడు. ఇంగ్లండ్పై ఆరంగేట్రం చేసిన ఆయన మొదట్లో బౌలర్గానే పరిగణించేవారు. కానీ, పాకిస్థాన్పై ట్రిపుల్ సెంచరీ (365)తో స్టార్ బ్యాటరైపోయాడు సోబర్స్. ఆల్రౌండర్గా అదరగొట్టిన సోబర్స్.. 20 ఏళ్ల కెరీర్లో 8,000 పరుగులు సాధించడమే కాకుండా బంతితో చెలరేగి 235 వికెట్లు పడగొట్టాడు.

అంతేకాదు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఒకేఓవర్లో ఆరు బంతులకు ఆరు సిక్సర్లు కొట్టిన తొలి ఆటగాడిగా చరిత్రకెక్కాడీ లెజెండ్. అంతర్జాతీయ క్రికెట్పై చెరగని ముద్ర వేసిన ఆయన గౌరవార్థం.. పురుషులకు ఏటా మెన్స్ అవార్డును ‘ది సర్ గ్యారీ సోబర్స్ అవార్డు’ పేరుతో ఇస్తోంది ఐసీసీ.