పడిలేవడం అలవాటు చేసుకున్న టీమ్ఇండియా.. వెస్టిండీస్తో టీ20 సిరీస్ను సమం చేసింది. వన్డే సిరీస్ తరహాలోనే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్లో భారత బ్యాటింగ్ యూనిట్ దుమ్మురేపింది. మొదట బౌలర్లు రాణించడంతో విండీస్ ఓ మాదిరి స్కోరుకు పరిమితం కాగా.. ఆనక యువ ఓపెనర్లు యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో యంగ్ఇండియా సునాయాసంగా గెలుపొందింది.
లాడర్హిల్: ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న భారత్.. విండీస్తో టీ20 సిరీస్ను సమం చేసింది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శనివారం అమెరికా వేదికగా జరిగిన నాలుగో పోరులో టీమ్ఇండియా 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా సిరీస్ 2-2తో సమమైంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. హెట్మైర్ (61; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధశతకంతో ఆకట్టుకోగా.. షై హోప్ (45; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. భారత బౌలర్లలో అర్ష్దీప్ 3, కుల్దీప్ 2 వికెట్లు తీశాడు. అనంతరం లక్ష్యఛేదనలో టీమ్ఇండియా 17 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 179 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (51 బంతుల్లో 84 నాటౌట్; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ అర్ధశతకంతో ఆకట్టుకోగా.. మరో ఓపెనర్ శుభ్మన్ గిల్ (47 బంతుల్లో 77; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) చక్కటి ఇన్నింగ్స్తో ఫామ్ అందుకున్నాడు. జైస్వాల్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక ఐదో టీ20 ఆదివారం ఇక్కడే జరగనుంది.
ఈ పిచ్పై మొదట బ్యాటింగ్ చేసిన జట్లే ఎక్కువ మ్యాచ్ల్లో గెలిచిన రికార్డు ఉండటంతో టాస్ గెలిచిన విండీస్ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకుంది. అందుకు తగ్గట్లే ధాటిగా ఆడిన కరీబియన్లు 5 ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 48 పరుగులు చేశారు. ఈ దశలో సూపర్ క్యాచ్తో బ్రాండన్ కింగ్ (18)ను వెనక్కి పంపిన కుల్దీప్.. తన తొలి ఓవర్లో పూరన్, పావెల్ను ఔట్ చేసి స్కోరు వేగానికి బ్రేకులు వేశాడు. అయితే హోప్, హెట్మైర్ రాణించడంతో విండీస్ ఈ సిరీస్లోనే అత్యధిక స్కోరు నమోదు చేసింది. ఇన్నింగ్స్ తొలి బంతికే బౌండ్రీ బాదిన జైస్వాల్ తన ఉద్దేశం ఏంటో చాటి చెప్పాడు. మూడు ఓవర్లలోనే ఐదు ఫోర్లు బాదిన యశస్వి జట్టుకు శుభారంభం అందించగా.. మరో ఎండ్లో గిల్ కూడా దంచుడు ప్రారంభించాడు. పవర్ప్లే ముగిసేసరికి భారత్ వికెట్ నష్టపోకుండా 66 పరుగులు చేసింది. ఇక అక్కడి నుంచి అదే జోరు కొనసాగించిన ఓపెనర్లు విండీస్ బౌలర్లకు చుక్కలు చూపారు. విజయానికి 14 పరుగుల దూరంలో గిల్ ఔటైనా.. తిలక్ (7 నాటౌట్) అండతో జైస్వాల్ మ్యాచ్ను ముగించాడు.
వెస్టిండీస్: 178/8 (హెట్మైర్ 61, షై హోప్ 45; అర్ష్దీప్ 3/38, కుల్దీప్ 2/26),
భారత్: 17 ఓవర్లలో 179/1 (యశస్వి 84 నాటౌట్, గిల్ 77; షెఫర్డ్ 1/35).