దుబాయ్: ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన యువ భారత జట్టు.. అండర్-19 ఆసియా కప్లో సెమీఫైనల్కు దూసుకెళ్లింది. గ్రూప్-‘ఎ’లో భాగంగా సోమవారం జరిగిన పోరులో భారత్ 4 వికెట్ల తేడాతో అఫ్గానిస్థాన్ను చిత్తు చేసింది. లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్ల్లో రెండింట గెలిచిన యువ భారత్.. 4 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంతో సెమీఫైనల్లో అడుగుపెట్టింది. మొదట బ్యాటింగ్కు దిగిన అఫ్గన్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. సారథి సులేమాన్ సఫీ (73), ఇజాజ్ అహ్మద్ (86 నాటౌట్; ఒక ఫోర్, 7 సిక్సర్లు) రాణించారు. మన బౌలర్లలో రాజ్వర్ధన్, రాజ్ బవా, విక్కీ, కుషల్ తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం ఛేదనలో యంగ్ఇండియా 48.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 262 పరుగులు చేసింది. హర్నూర్ సింగ్ (65), రాజ్ బవా (43 నాటౌట్) సత్తాచాటడంతో మరో 10 బంతులు మిగిలుండగానే భారత్ జయభేరి మోగించింది. అఫ్గన్ బౌలర్లలో నూర్ అహ్మద్ నాలుగు వికెట్లు పడగొట్టాడు.
197/6 నుంచి..
కష్టతరమైన లక్ష్యఛేదనలో యువ భారత్కు మెరుగైన ఆరంభం లభించింది. గత రెండు మ్యాచ్ల్లో చక్కటి ఇన్నింగ్స్లతో ఆకట్టుకున్న హర్నూర్ సింగ్ మరోసారి విజృంభించగా.. అతడికి రఘువంశి (35), కెప్టెన్ యష్ ధుల్ (26) సహకరించారు. ఆంధ్ర ఆటగాడు షేక్ రషీద్ (6), నిషాంత్ సింధు (19), వికెట్ కీపర్ ఆరాధ్య యాదవ్ (12) ఎక్కువ సేపు నిలువలేకపోవడంతో.. ఒక దశలో భారత్ 197/6తో నిలిచింది. ఇక ఛేదన కష్టమే అనుకుంటున్న తరుణంలో రాజ్ బవా, కుషల్ తాంబె (35 నాటౌట్) అబేధ్యమైన ఏడో వికెట్కు 65 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. పాకిస్థాన్తో జరిగిన గత మ్యాచ్లో చివరి ఓవర్లో తడబడి ఓడిన యువ భారత్.. ఈసారి ఎలాంటి తప్పిదాలకు తావివ్వకుండా విజృంభించింది. గ్రూప్-‘బి’లో అగ్రస్థానంలో నిలిచిన జట్టుతో యంగ్ ఇండియా సెమీస్లో అమీతుమీ తేల్చుకోనుంది.
సంక్షిప్త స్కోర్లు
అఫ్గానిస్థాన్: 50 ఓవర్లలో 259/4 (సులేమాన్ 73, ఇజాజ్ అహ్మద్ 86 నాటౌట్; కుషల్ తాంబె 1/25), భారత్: 48.2 ఓవర్లలో 262/6 (హర్నూర్ సింగ్ 65, రాజ్ బవా 43; నూర్ అహ్మద్ 4/43).