వరుస విజయాలతో దూసుకెళ్తున్న యువ భారత జట్టు.. ఓటమి ఎరుగకుండా అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో అడుగుపెట్టింది. కెప్టెన్ యష్ ధుల్ సెంచరీ.. వైస్ కెప్టెన్ షేక్ రషీద్ అద్వితీయ ఇన్నింగ్స్తో మొదట భారీ స్కోరు చేసిన యంగ్ఇండియా.. ఆనక ఆస్ట్రేలియాను తక్కువ స్కోరుకే కట్టి పడేసింది. ఇప్పటికే నాలుగుసార్లు ప్రపంచకప్ చేజిక్కించుకున్న యువ భారత జట్టు.. ఫైనల్కు చేరడం వరుసగా ఇది నాలుగోసారి. శనివారం ఇంగ్లండ్తో జరుగనున్న తుదిపోరులోనూ ఇదే జోరు కొనసాగించి యంగ్ఇండియా పాంచ్ పటాకా మోగించాలని ఆశిద్దాం!
అంటిగ్వా: ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన యువ భారత జట్టు అండర్-19 ప్రపంచకప్ ఫైనల్కు దూసుకెళ్లింది. బుధవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన రెండో సెమీఫైనల్లో యంగ్ఇండియా 96 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. ఇప్పటి వరకు నాలుగుసార్లు ప్రపంచకప్ విజేతగా నిలిచిన యువభారత్కు ఇది వరుసగా నాలుగో వరల్డ్కప్ ఫైనల్ కావడం విశేషం. కీలక పోరులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన యంగ్ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసింది. కెప్టెన్ యష్ ధుల్ (110 బంతుల్లో 110; 10 ఫోర్లు, ఒక సిక్సర్) శతకానికి.. వైస్ కెప్టెన్, తెలుగు ఆటగాడు షేక్ రషీద్ (108 బంతుల్లో 94; 8 ఫోర్లు, ఒక సిక్సర్) బాధ్యతాయుత ఇన్నింగ్స్ తోడవడంతో భారీ స్కోరు చేసింది. ఆఖర్లో దినేశ్ (4 బంతుల్లో 20 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో జాక్ నిబెట్, సాజ్మన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ఆస్ట్రేలియా 41.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది. లచాన్ షా (51) టాప్ స్కోరర్ కాగా.. భారత బౌలర్లలో విక్కీ ఓస్తాల్ మూడు, నిశాంత్, రవికుమార్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. సెంచరీతో చెలరేగిన కెప్టెన యష్ ధుల్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. శనివారం జరుగనున్న తుదిపోరులో ఇంగ్లండ్తో యంగ్ఇండియా అమీతుమీ తేల్చుకోనుంది.
దిగ్గజ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ కోచింగ్లో ఓటమి ఎరుగకుండా దూసుకెళ్తున్న యువ భారత్ లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ నెగ్గింది. క్వార్టర్స్లో డిఫెండింగ్ చాంపియన్ బంగ్లాదేశ్ను మట్టికరిపించిన మన కుర్రాళ్లు.. సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను కంగారెత్తించారు. ఇక శనివారం జరుగనున్న ఫైనల్ ఫైట్లో.. 24 ఏండ్ల తర్వాత ఈ టోర్నీ ఫైనల్కు చేరిన ఇంగ్లండ్ను యంగ్ఇండియా ఢీ కొట్టనుంది. టోర్నీ ఆరంభ మ్యాచ్ అనంతరం కరోనా కారణంగా ఆరుగురు ప్రధాన ఆటగాళ్లు జట్టుకు దూరమైనా.. మన కుర్రాళ్లు అజేయంగా నిలిచారంటే ఈ టోర్నీలో మన జట్టు ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. భారీ అంచనాలతో వెస్టిండీస్లో అడుగుపెట్టిన మన కుర్రాళ్లు బౌలింగ్, బ్యాటింగ్లో అందుకు తగ్గట్లే రాణిస్తున్నారు. వచ్చే వారంలో బెంగళూరు వేదికగా.. ఐపీఎల్ మెగా వేలం జరుగనుండగా.. ఇప్పటికే అండర్-19 స్టార్లపై పలు ఫ్రాంచైజీలు కన్నేసినట్లు సమాచారం. టోర్నీలో సెంచరీ చేసిన మూడో భారత సారథిగా రికార్డుల్లోకెక్కిన యష్ ధుల్తో పాటు విధ్వంసక ఓపెనర్ హర్నూర్ సింగ్, గుంటూరు కుర్రాడు షేక్ రషీద్, యంగ్ స్పిన్నర్ విక్కీ ఓస్తాల్ను చేజిక్కించుకునేందుకు పలు జట్లు ఆసక్తి కనబరుస్తున్నాయి. 2008 అండర్-19 ప్రపంచకప్ ప్రదర్శన ఆధారంగా ఐపీఎల్ కాంట్రాక్ట్ దక్కించుకున్న విరాట్ కోహ్లీ.. తర్వాతి కాలంలో టీమ్ఇండియా స్టార్గా ఎదిగిన నేపథ్యంలో.. యువ ఆటగాళ్లు అతడినే ఆదర్శంగా తీసుకుంటూ ముందు కు సాగాలని భావిస్తున్నారు.
అండర్-19 ప్రపంచకప్లో సెంచరీ చేసిన మూడో భారత కెప్టెన్గా యష్ ధుల్ రికార్డుల్లోకెక్కాడు. విరాట్ కోహ్లీ (2008), ఉన్ముక్త్ చంద్ (2012)
కూడా ఈ ఘనత సాధించారు.
అండర్-19 ప్రపంచకప్లో యువ భారత జట్టు ఫైనల్ చేరడం ఇది వరుసగా నాలుగోసారి. గత మూడు (2016, 2018, 2020) ఎడిషన్లలోనూ భారత్ తుది
పోరుకు చేరింది. ఓవరాల్గా భారత్కు ఇది ఎనిమిదో ఫైనల్.
సంక్షిప్త స్కోర్లు
భారత్: 50 ఓవర్లలో 290/5 (యష్ ధుల్ 110, రషీద్ 94; జాక్ నిబెట్ 2/41, సాజ్మన్ 2/57), ఆస్ట్రేలియా: 41.5 ఓవర్లలో 194 ఆలౌట్ (లచాన్ షా 51; విక్కీ 3/42, నిషాంత్ 2/25, రవి కుమార్ 2/37).