రెండో రోజు ఆట అనంతరం కష్టాల్లో పడ్డట్లు కనిపించిన టీమ్ఇండియాను.. యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ ఆదుకున్నాడు. టాపార్డర్ తడబడ్డ చోట ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగి.. చకచక పరుగులు జోడించాడు. ఫలితంగా తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్కు నామమాత్ర ఆధిక్యం దక్కగా.. రెండో ఇన్నింగ్స్లో అశ్విన్ అదరగొట్టాడు!
గింగిరాలు తిరిగే బంతులతో అశ్విన్ ఇంగ్లిష్ బ్యాటర్లను క్రీజులో కుదురుకోనివ్వకుండా విజృంభిస్తే.. తానే తక్కువ కాదన్నట్లు కుల్దీప్ యాదవ్ తన మణికట్టు కనికట్టు కనబర్చాడు. ఫలితంగా రోహిత్సేన ముందు 192 పరుగుల నామమాత్ర లక్ష్యం నిలువగా.. మూడో రోజు పూర్తయ్యేసరికి టీమ్ఇండియా వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది. మరో 152 రన్స్ కొడితే.. సిరీస్ రోహిత్ సేన సొంతం కానుంది!!
Dhuv Jurel | రాంచీ: స్వదేశంలో మరో సిరీస్ పట్టేసేందుకు టీమ్ఇండియా సిద్ధమైంది. భిన్నంగా స్పందిస్తున్న రాంచీ పిచ్పై మన స్పిన్నర్లు సత్తాచాటడంతో నాలుగో టెస్టుపై రోహిత్ సేన పట్టు సాధించింది. రవిచంద్రన్ అశ్విన్ (5/51), కుల్దీప్ యాదవ్ (4/22) ధాటికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో 145 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్ జాక్ క్రాలీ (60) ఒంటరి పోరాటం చేయగా.. పోప్ (0), డకెట్ (15), రూట్ (11), స్టోక్స్ (4), ఫోక్స్ (17) విఫలమయ్యారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 46 పరుగులతో కలుపుకొని.. భారత్ ముందు 192 పరుగుల లక్ష్యం నిలిచింది. మూడో సెషన్ చివర్లో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమ్ఇండియా.. వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (24 బ్యాటింగ్; 4 ఫోర్లు), యశస్వి జైస్వాల్ (16 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. చేతిలో 10 వికెట్లు ఉన్న భారత్.. విజయానికి ఇంకా 152 పరుగుల దూరంలో ఉంది. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 219/7తో ఆదివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్.. చివరకు 307 పరుగులకు ఆలౌటైంది. చేతిలో ఉన్న మూడు వికెట్లతో ధ్రువ్ జురెల్ (90; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) అద్వితీయ పోరాటం చేశాడు. అతడికి కుల్దీప్ యాదవ్ (131 బంతుల్లో 28) చక్కటి సహకారం అందించాడు. కుల్దీప్ అండగా ఉన్నంతసేపు ఆచితూచి ఆడిన ధ్రువ్.. ఆ తర్వాత ధనాధన్ షాట్లతో ప్రత్యర్థి ఆధిక్యాన్ని కుదించాడు. దీంతో టీమ్ఇండియా ఈ మ్యాచ్లో పునరాగమనం చేయగలిగింది.
తొలి ఇన్నింగ్స్లో కష్టసమయంలో క్రీజులోకి వచ్చిన ధ్రువ్ జురెల్ చక్కటి బ్యాటింగ్తో విమర్శకులు ప్రశంసలు అందుకున్నాడు. ధోనీని తలపించాడని.. బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కొనియాడగా.. చివరి వరస బ్యాటర్లతో కలిసి ఎలా ఆడాలో ధ్రువ్ను చూసి నేర్చుకోవాలని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. అర్ధశతకం అనంతరం ధ్రువ్ సంబురాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కార్గిల్ యుద్ధంలో సైనికుడిగా సేవలందించి పదవీ విరమణ పొందిన తండ్రి కోసం హాఫ్సెంచరీ తర్వాత ధ్రువ్ సెల్యూట్తో సెలబ్రేషన్స్ జరుపుకున్నాడు.
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 353; భారత్ తొలి ఇన్నింగ్స్: 307 (ధ్రువ్ 90, యశస్వి 73; బషీర్ 5/119, హార్ట్లీ 3/68); ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 145 (క్రాలీ 60; అశ్విన్ 5/51, కుల్దీప్ 4/22); భారత్ రెండో ఇన్నింగ్స్: 40/0 (రోహిత్ 24 నాటౌట్, యశస్వి 16 నాటౌట్).
టెస్టుల్లో 35వ సారి 5 వికెట్ల ప్రదర్శన చేసిన అశ్విన్.. భారత్ నుంచి అత్యధిక సార్లు ఈ ఘనత సాధించిన అనిల్ కుంబ్లే (35) సరసన చేరాడు.