పొట్టి ప్రపంచకప్ సన్నాహకంగా భావిస్తున్న దక్షిణాఫ్రికా సిరీస్కు వర్షం అడ్డంకిగా మారింది! ఆదివారం జరగాల్సిన తొలి పోరు వరుణుడి కారణంగా రద్దు కాగా.. నేటి పోరుకు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. టీ20 వరల్డ్కప్ ప్రారంభానికి ముందు భారత్ మరో ఐదు మ్యాచ్లు మాత్రమే ఆడనున్న నేపథ్యంలో.. యువ ఆటగాళ్లకు ఇది కఠిన పరీక్ష కానుంది.
పోర్ట్ ఎలిజబెత్: వన్డే ప్రపంచకప్ ఫైనల్ పరాజయం అనంతరం ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్ నెగ్గిన టీమ్ఇండియా.. దక్షిణాఫ్రికా పర్యటనకు సిద్ధమైంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి పోరు వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దు కాగా.. మంగళవారం ఇరు జట్ల మధ్య రెండో టీ20 జరగనుంది. వచ్చే ఏడాది అమెరికా, వెస్టిండీస్ వేదికగా పొట్టి ప్రపంచకప్ జరుగనుండగా.. దానికి ముందు భారత జట్టు మరో ఐదు టీ20లు మాత్రమే ఆడనుంది. ఈ మ్యాచ్ల్లో బ్యాటింగ్ స్థానాలపై ఓ అవగాహనకు రావాలని టీమ్ఇండియా ఆశిస్తున్నది. నిరుడు టీ20 ప్రపంచకప్ అనంతరం సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. ఈ ఫార్మాట్ నుంచి దూరంగా ఉండటంతో.. మరి వచ్చే మెగాటోర్నీలో వీరిద్దరూ ఆడతారా లేదా అనేది సందేహంగా మారింది. అయితే అందుబాటులో ఉండకపోతే.. యువ ఆటగాళ్లతోనే వరల్డ్కప్ బరిలోకి దిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో కుర్రాళ్లకు ఇది కఠిన పరీక్ష కానుంది.
వచ్చే ఏడాది ఐపీఎల్ తర్వాతే మెగాటోర్నీ జట్టుపై ఓ అవగాహనకు రానుండగా.. బ్యాటింగ్కు సవాల్ విసిరే దక్షిణాఫ్రికా పిచ్లపై మన ఆటగాళ్లు ఎలాంటి ప్రదర్శన చేస్తారో చూడాలి. సఫారీ గడ్డపై జరిగిన గత నాలుగు టీ20 సిరీస్ల్లో భారత్ రెండింట గెలిచి మరో రెండింటిని ‘డ్రా’ చేసుకుంది. ఈ సిరీస్ కోసం బీసీసీఐ 17 మందితో కూడిన జట్టును ప్రకటించగా.. యంగ్ గన్స్కు పెద్దపీట వేసింది. యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ ఓపెనింగ్ చేస్తారా లేక.. శుభ్మన్ గిల్కు అవకాశం ఇస్తారా చూడాలి.
కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్తో పాటు శ్రేయస్ అయ్యర్, రింకూ సింగ్, జితేశ్ శర్మ, రవీంద్ర జడేజాతో మిడిలార్డర్ బలంగా కనిపిస్తున్నది. రోహిత్, కోహ్లీ, రాహుల్, పాండ్యా, బుమ్రా అందుబాటులో లేకపోయినా.. నాణ్యమైన ప్లేయర్లు అందుబాటులో ఉన్నారు. జడేజా, సిరాజ్, కుల్దీప్ రాకతో బౌలింగ్లో వైవిధ్యం పెరిగింది. మరోవైపు సొంతగడ్డపై దక్షిణాఫ్రికాను ఎదుర్కోవడం అంత సులువైన విషయం కాదు. రెగ్యులర్ కెప్టెన్ బవుమాకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతినివ్వగా.. మార్క్మ్ జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. అతడితో పాటు హెన్రిక్స్, క్లాసెన్, మిల్లర్, జాన్సెన్తో సఫారీ జట్టు కూడా శత్రుదుర్బేధ్యంగా ఉంది. బౌలింగ్లో కోట్జీ, కేశవ్ మహరాజ్, తబ్రేజ్ షంసీని ఎదుర్కోవడం మనవాళ్లకు కష్టమే!
వికెట్ బౌలింగ్, బ్యాటింగ్కు సమానంగా సహకరించనుంది. ఇప్పటి వరకు ఇక్కడ రెండు టీ20లు మాత్రమే జరగగా.. మంగళవారం మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉంది.
భారత్: సూర్యకుమార్ (కెప్టెన్), యశస్వి, రుతురాజ్/గిల్, శ్రేయస్, రింకూసింగ్, జితేశ్, జడేజా, కుల్దీప్/రవి, ముఖేశ్, అర్ష్దీప్, సిరాజ్.
దక్షిణాఫ్రికా: మార్క్మ్ (కెప్టెన్), హెన్రిక్స్, బ్రీట్జ్, స్టబ్స్/క్లాసెన్, మిల్లర్, ఫెరీరా, జాన్సెన్, కేశవ్, కోట్జీ, బర్గర్, షంసీ.