జకార్తా: ఆరంభం నుంచి ఆధిక్యంలో ఉండి.. ఆఖర్లో ప్రత్యర్థికి అవకాశం ఇచ్చే అలవాటు మార్చుకోని భారత్.. మరోసారి చక్కటి చాన్స్ కోల్పోయింది. హాకీ ఆసియా కప్ ఆరంభ మ్యాచ్ చివరి నిమిషాల్లో పట్టు వదిలేసిన భారత్ ‘డ్రా’తో సరిపెట్టుకుంది. సోమవారం భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన పోరు 1-1తో ‘డ్రా’గా ముగిసింది. భారత్ తరఫున కార్తి సెల్వవ్ (9 వ నిమిషంలో) ఏకైక గోల్ సాధించగా.. 59వ నిమిషంలో అబ్దుల్ రాణా గోల్తో పాక్ స్కోరు సమం చేసింది.
తొలి క్వార్టర్లోనే ఆధిక్యంలోకి దూసుకెళ్లిన భారత్ ఏ దశలోనూ ఇబ్బంది పడలేదు. అయితే భారత ప్రయత్నాలను పాక్ డిఫెండర్లు సమర్థవంతంగా అడ్డుకోవడంతో మరో స్కోరు చేయలేకపోయింది. తొలి అర్ధభాగం ముగిసే వరకు కూడా ప్రత్యర్థి నుంచి చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రతిఘటన ఎదురు కాలేదు. మూడో క్వార్టర్లోనూ మన జోరే కొనసాగగా.. మరో రెండు నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా అబ్దుల్ రాణా చక్కటి గోల్తో పాక్ను పోటీలోకి తెచ్చాడు. ఇక ఆ తర్వాత మరో గోల్ చేసేందుకు భారత ఆటగాళ్లు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. పూల్-‘ఎ’లో భాగంగా మంగళవారం జపాన్తో భారత్ తలపడనుంది. ఇతర మ్యాచ్ల్లో మలేషియా 7-0తో ఒమన్ను చిత్తు చేయగా, కొరియా 6-1తో బంగ్లాదేశ్ను ఓడించింది. జపాన్ 9-0తో ఇండోనేషియాను మట్టికరిపించింది.