ఫహాద్ ఫాజిల్ ఇంద్రజాలికుని పాత్రలో కనిపించనున్న ఫాంటసీ డ్రామా ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. ప్రఖ్యాత దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి సమర్పణలో ఆర్కా మీడియా వర్క్స్, షోయింగ్ బిజినెస్ పతాకాలపై ఎస్.ఎస్.కార్తికేయ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శశాంక్ యేలేటి దర్శకుడు. సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్ సోమవారం హైదరాబాద్లో జరిగింది. ‘మనసులకు హత్తుకునే సినిమా ఇది. టీజర్ అందరికీ నచ్చే ఉంటుంది. ఇకపై రాబోయే కంటెంట్ ఇంకా బాగుంటుంది. ఫహాద్ ఫాజిల్ అంటే నాకు అభిమానం. ‘పుష్ప’ షూట్లో ఆయన్ను కలిసి ఈ కథ వినిపించాం. ఫస్ట్ నేరేషన్లోనే ఓకే చేశారు.
ఈ మధ్యకాలంలో ఇలాంటి జానర్ రాలేదు. ఇందులో వీఎఫ్ఎక్స్ కీలకం. రాజమౌళి స్టాంప్ పడ్డాకే స్క్రిప్ట్ లాక్ చేశాం. షూటింగ్ పూర్తయ్యాక మరోసారి ఆయనకు చూపిస్తాం’ అని నిర్మాత ఎస్.ఎస్.కార్తికేయ చెప్పారు. ఆడియో బైట్ ద్వారా ఫహాద్ ఫాజిల్ మాట్లాడుతూ ‘తెలుగులో హీరోగా స్ట్రెయిట్ సినిమా చేయాలని ఎప్పుట్నుంచో అనుకుంటున్నాను. మంచి స్క్రిప్ట్ కోసం చూస్తున్న సమయంలో డైరెక్టర్ శశాంక్ ఈ కథ చెప్పారు. ఇలాంటి మంచి ఫాంటసీ డ్రామా ఎలిమెంట్స్ ఉన్న కథ ద్వారా తెలుగులో సినిమా చేయడం ఆనందంగా ఉంది’ అన్నారు. ప్రేక్షకులకు అద్భుతమైన వినోదాన్ని పంచే సినిమా ఇదని దర్శకుడు శశాంక్ యేలేటి నమ్మకంగా చెప్పారు.