బ్యాంకాక్ : ఏసీసీ మహిళల ఆసియాకప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో యువ భారత్ టైటిల్ విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో రాధాయాదవ్ నేతృత్వంలోని టీమ్ఇండియా 46 పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై ఘన విజయం సాధించింది. తొలుత తేజల్ హసన్బీస్(51 నాటౌట్) అజేయ అర్ధసెంచరీకి తోడు కెప్టెన్ రాధాయాదవ్(36) రాణించడంతో భారత్ 20 ఓవర్లలో 134/7 స్కోరు చేసింది. బంగ్లా బౌలింగ్ ధాటికి ఒక దశలో 44 పరుగులకే నందిని కశ్యప్(8), దినేశ్ వృందా(19), మిన్నుమణి(0), అనుశ్కశర్మ(8) వికెట్లు కోల్పోయిన జట్టును తేజల్ ఆదుకుంది.
రాధాయాదవ్తో కలిసి ఇన్నింగ్స్ను గాడిలో పడేసింది. వీరిద్దరు బంగ్లా బౌలింగ్ను సమర్థంగా ఎదుర్కొంటూ సాధికారిక ఇన్నింగ్స్ ఆడారు. ఐదో వికెట్కు 69 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఫహిమా ఖాతూన్(4/25) నాలుగు వికెట్లు పడగొట్టింది. స్వల్ప లక్ష్యఛేదనకు దిగిన బంగ్లా 19.1 ఓవర్లలో 88 పరుగులకు కుప్పకూలింది. ప్రేమ రావత్(3/12), తనూజ కన్వర్(2/11), సోనియా(2/21) బంగ్లా పతనంలో కీలకమయ్యారు. కెప్టెన్ షమీమా సుల్తానా(20) టాప్ స్కోరర్గా నిలువగా, మిగతావారు స్వల్ప స్కోర్లకు పరిమితమయ్యారు. తేజల్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.