హైదరాబాద్, ఆట ప్రతినిధి: సొంతగడ్డపై జరుగుతున్న ఎఫ్ఐహెచ్ ఉమెన్స్ హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్లో భారత అమ్మాయిలు అదరగొట్టారు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో శుక్రవారం జరిగిన సెమీస్ పోరులో భారత్.. 1-0 తో ఇటలీని ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించడమే గాక ప్రపంచకప్ బెర్త్నూ ఖరారు చేసుకుంది. ఇరుజట్ల మధ్య హోరాహోరీగా జరిగిన సెమీస్లో భారత్ తరఫున మనీషా చౌహాన్ 40వ నిమిషంలో ఏకైక గోల్ కొట్టింది. లీగ్ దశను అజేయంగా ముగించిన సలీమ సారథ్యంలోని యువ భారత్.. కీలక సెమీస్లోనూ అదే ఆటతీరుతో సత్తాచాటింది. సెమీస్ విజయంతో శనివారం జరుగబోయే ఫైనల్లో భారత్.. ఇంగ్లండ్తో అమీతుమీ తేల్చుకోనుంది. రెండో సెమీస్లో ఇంగ్లండ్.. 2-0తో స్కాట్లాండ్ను ఓడించి ఫైనల్కు ప్రవేశించింది.
మ్యాచ్లో తొలి క్వార్టర్స్లో ఇటలీ దూకుడుగా ఆడింది. పదేపదే భారత గోల్పోస్ట్పై కన్నేసినా భారత డిఫెండర్లు వారికి ఆ అవకాశమివ్వలేదు. ఆరో నిమిషంలో ఇటలీకి గోల్ చేసే అవకాశమొచ్చినా గోల్కీపర్ బిచు దేవి అద్భుతంగా అడ్డుకుంది. రెండో క్వార్టర్ నుంచి భారత్ ఎదురుదాడికి దిగింది. అయితే ఈ క్వార్టర్లో పలుమార్లు పెనాల్టీ కార్నర్లు దక్కినా భారత్ వాటిని గోల్స్గా మలచలేకపోయింది. మ్యాచ్ అర్ధ భాగం ముగిశాక ఆట 40వ నిమిషంలో వచ్చిన పీసీని మనీషా గోల్ కొట్టింది. ఆ తర్వాత కూడా భారత్కు ఐదు పీసీలు వచ్చినా వాటిని గోల్స్ కొట్టడంలో విఫలమైంది. అయితే అవతలి వైపు ఇటలీ ఆట పేలవంగా సాగడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు.