కోజికోడ్: జాతీయ ఫెడరేషన్ కప్ సీనియర్స్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భారత అథ్లెట్లు జాతీయ రికార్డులను తిరుగరాస్తున్నారు. బుధవారం ఆఖరి రోజు వర్షం కారణంగా పోటీలకు కొంత అంతరాయం ఏర్పడింది. అనంతరం యథావిధిగా జరిగిన పోటీల్లో మన అథ్లెట్లు తమ ప్రదర్శనతో సత్తా చాటారు. పురుషుల 200 మీటర్ల రేసు ఫైనల్లో అమ్లాన్ బొర్గోహైన్ 20.52 సెకండ్లలో లక్ష్యం పూర్తి చేసి కొత్త రికార్డు నెలకొల్పాడు. పురుషుల 5000 మీటర్లలో అవినాశ్ సాబ్లె మీట్ రికార్డును బద్దలు కొట్టాడు. 13:39.43 సెకండ్లలో పరుగు పూర్తి చేసి స్వర్ణం చేజిక్కించుకున్నాడు. మహిళల 200 మీ ఫైనల్లో హిమాదాస్ (అస్సాం), ఐశ్వర్య మిశ్రా (మహారాష్ట్ర), ప్రియమోహన్ (కర్ణాటక) ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు.