జింబాబ్వేతో జరుగుతున్న మూడో వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. భారీ స్కోరు చేసింది. శిఖర్ ధావన్ (40), కేఎల్ రాహుల్ (30) జట్టుకు నెమ్మదైన ఆరంభం అందించారు. అయితే తమకు దక్కిన ఆరంభాలను భారీ ఇన్నింగ్స్లుగా మార్చుకోవడంలో విఫలమయ్యారు. ఇలాంటి సమయంలో శుభ్మన్ గిల్ (130) చెలరేగి ఆడాడు. అతనికి సహకరించిన ఇషాన్ కిషన్ (50) కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడు.
కిషన్ అవుటైన తర్వాత వచ్చిన దీపక్ హుడా (1) నిరాశ పరచగా.. వరుసగా రెండు సిక్సర్లు బాదిన సంజూ శాంసన్ (15) ఆ మరుసటి బంతికే పెవిలియన్ చేరాడు. అక్షర్ పటేల్ (1), శార్దూల్ ఠాకూర్ (9) కూడా భారీ షాట్లు ఆడే క్రమంలోనే మైదానం వీడారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు 8 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. జింబాబ్వే ముందు 290 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఇవాన్స్ ఐదు వికెట్లతో చెలరేగగా.. న్యాచీ, జాంగ్వే చెరో వికెట్ తీసుకున్నారు.