IND vs WI 2nd ODI | వన్డే క్రికెట్ చరిత్రలో తొలిసారి ప్రపంచకప్నకు అర్హత సాధించలేకపోయిన వెస్టిండీస్తో వన్డే సిరీస్ కు ప్రధాన ఆటగాళ్లను ఎంపిక చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతుండటంతో.. బీసీసీఐ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా గురువారం జరిగిన తొలి వన్డేలో కనీస ప్రతిఘటన చూపలేకపోయిన కరీబియన్లు.. మరీ గల్లీ టీమ్ తరహాలో 114 పరుగులకే ఆలౌటయ్యారు.
దీంతో ఛేదనలో ప్రయోగాలకు దిగిన టీమ్ఇండియా 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరింది. అయితే ఆ మ్యాచ్లోకోహ్లీ బ్యాటింగ్కు దిగకపోగా.. రోహిత్ ఆఖర్లో క్రీజులో అడుగుపెట్టాడు. నానాటికి తీసికట్టులా మారుతున్న వెస్టిండీస్ జట్టు ప్రదర్శనకు పోటీనిచ్చేందుకు ప్రధాన ఆటగాళ్ల అవసరం లేదని ఇప్పటికే సునీల్ గవాస్కర్ సెలెక్షన్ కమిటీపై ఆగ్రహం వ్యక్తం చేయగా.. వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వాల్సిందేనని మాజీ క్రికెటర్ అభిప్రాయపడుతున్నారు.
ఫలితంగా.. విండీస్తో రెండో వన్డేకు రోహిత్, కోహ్లీకి విశ్రాంతి నిచ్చారు. హిట్మ్యాన్ గైర్హాజరీలో.. హార్దిక్ పాండ్యా జట్టుకు సారథ్యం వహిస్తుండగా.. వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్కు టీమ్లో చోటు దక్కింది. చాన్నాళ్లుగా ఈ అవకాశం కోసం నిరీక్షిస్తున్న సంజూ ఎలా వినియోగించుకుంటాడో చూడాలి. పిచ్ స్పిన్కు అనుకూలించనున్న నేపథ్యంలో అదనపు స్పిన్నర్గా అక్షర్ పటేల్కు చోటు దక్కింది. ఈ ఏడాది స్వదేశంలో వన్డే ప్రపంచకప్ జరుగనుండగా.. దాని కోసం బీసీసీఐ యువ ఆటగాళ్లను పరీక్షించాలని భావిస్తున్నది. ఈ మ్యాచ్లో పూర్తిగా యువ ఆటగాళ్ల మీద బాధ్యత వేసింది. ‘రోగి కోరుకున్నదే.. వైద్యుడు సూచించినట్లు’.. టాస్ గెలిచిన వెస్టిండీస్.. భారత జట్టును బ్యాటింగ్కు ఆహ్వానించింది. మరి యంగ్ గన్స్ ఏమాత్రం స్కోరు చేస్తారో చూడాలి!