Virat Kohli: భారత్ – శ్రీలంక మధ్య ముంబై వేదికగా జరుగుతున్న వలర్డ్ కప్ 33వ లీగ్ మ్యాచ్లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నా మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. వాంఖేడే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఎదుట అతడి సెంచరీ (49)ల రికార్డును సమం చేస్తాడని భావించినా 12 పరుగుల తేడాతో శతకం మిస్ చేసుకున్న కోహ్లీ.. సచిన్ పేరిట ఉన్న మరో రికార్డును మాత్రం బ్రేక్ చేశాడు.
అంతర్జాతీయ క్రికెట్లో ఒక క్యాలెండర్ ఈయర్లో వెయ్యి లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో సచిన్.. ఏడు సార్లు ఈ ఘనత అందుకున్నాడు. ఈ ఏడాది కోహ్లీ.. 20 ఇన్నింగ్స్లలోనే వెయ్యి పరుగుల మైలురాయిని అందుకున్నాడు. సచిన్ తన వన్డే కెరీర్లో 1994, 96, 97, 98, 2000, 2003, 2007లలో వెయ్యికి పైగా పరుగులు సాధించాడు. ఇక విరాట్.. 2011 నుంచి 2014 దాకా వరుసగా నాలుగేండ్ల పాటు వెయ్యికి పైగా పరుగులు చేశాడు. ఆ తర్వాత 2017 నుంచి 2019 వరకూ మూడేండ్ల పాటు ఈ ఘనత అందుకున్నాడు. తాజాగా ఈ ఏడాది 20 ఇన్నింగ్స్లలోనే వెయ్యి పరుగులని దాటి ఎనిమిది సార్లు వెయ్యికి పైగా పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డుల నెలకొల్పాడు.
హిట్మ్యాన్ రికార్డు కూడా..
సచిన్తో పాటు భారత సారథి రోహిత్ శర్మ పేరిట ఉన్న రికార్డును కూడా కోహ్లీ అధిగమించాడు. వరల్డ్ కప్లలో అత్యధిక అర్థ సెంచరీలు చేసిన ఆటగాళ్లలో రోహిత్ శర్మ పేరిట ఉన్న 12 హాఫ్ పెంచరీల రికార్డును బ్రేక్ చేశాడు. శ్రీలంకపై జరుగుతున్న మ్యాచ్లో 88 పరుగులు చేయడం ద్వారా కోహ్లీ వరల్డ్ కప్లో 13వ అర్థ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఈ క్రమంలో అతడు రోహిత్ తో పాటు కుమార సంగక్కర, షకిబ్ అల్ హసన్ రికార్డును కూడా బ్రేక్ చేశాడు. వరల్డ్ కప్ చరిత్రలో నాన్ ఓపెనర్గా బరిలోకి దిగి అత్యధిక అర్థ సెంచరీలు సాధించినవారిలో కుమార సంగక్కర (12) పేరిట ఉన్న రికార్డును కోహ్లీ అధిగమించాడు.