టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా చరిత్ర సృష్టించాడు. భారత జట్టు లెజెండరీ కెప్టెన్ కపిల్ దేవ్ పేరిట ఉన్న 35 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆటలో అతను ఈ ఘనత సాధించాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 45 పరుగుల వ్యక్తి గత స్కోరుతో నిలిచిన జడేజా.. రెండో రోజు విజృంభించి ఆడాడు.
175 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో ఏడవ స్థానంలో లేదా అంతకన్నా వెనుక బ్యాటింగ్కు వచ్చి అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్గా రికార్డు సృష్టించాడు. అంతకుముందు ఈ రికార్డు కపిల్ దేవ్ పేరిట ఉండేది. అతను 1986లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో 163 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్లో జడేజా 175 పరుగులతో అజేయంగా నిలిచాడు.
ఓవరాల్గా చూసుకున్న ఏడోస్థానం అంతకంటే వెనుక బ్యాటింగ్కు వచ్చి కేవలం ముగ్గురు భారతీయులే 150 పైగా పరుగులు చేశారు. కపిల్ దేవ్, జడేజా కాకుండి భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ ఈ జాబితాలో ఉన్నాడు. 2019లో సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో రిషభ్ పంత్ 159 పరుగులతో నాటౌట్గా నిలిచాడు.
భారత లెజెండరీ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ.. ఏడో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ చేసిన అత్యధిక స్కోరు 144 మాత్రమే కావడం గమనార్హం. భారత జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన జడేజా.. పంత్ రెచ్చిపోయి ఆడుతున్నప్పుడు యాంకర్ రోల్ పోషించాడు. పంత్ అవుటైన తర్వాత కూడా మంచి కంట్రోల్ కనబరిచాడు. సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ ఇన్నింగ్సులో పంత్, అశ్విన్, షమీ ముగ్గురితోనూ జడ్డూ సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పడం విశేషం.