IND vs SL: వన్డే ప్రపంచకప్లో భాగంగా శ్రీలంకతో ముంబైలోని ప్రతిష్టాత్మక వాంఖెడే స్టేడియంలో భారత్ అదరగొట్టింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. శుభ్మన్ గిల్ (92 బంతుల్లో 92, 11 ఫోర్లు, 2 సిక్సర్లు), విరాట్ కోహ్లీ (94 బంతుల్లో 88, 11 ఫోర్లు) శతకాలు మిస్ చేసుకోగా శ్రేయస్ అయ్యర్ (56 బంతుల్లో 82, 3 ఫోర్లు, 6 సిక్సర్లు) ఆఖర్లో మెరుపులు మెరిపించి భారత్ భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. లంక బౌలర్లలో దిల్షాన్ మధుశంక.. ఐదు వికెట్లు పడగొట్టాడు.
వాంఖేడే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్కు తొలి ఓవర్లోనే షాక్ తాకింది. ఫస్ట్ బాల్కే బౌండరీ బాదిన కెప్టెన్ హిట్మ్యాన్.. మధుశంక వేసిన రెండో బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కానీ ఈ ఆరంభాన్ని లంక సద్వినియోగం చేసుకోలేదు. వన్ డౌన్లో వచ్చిన విరాట్ కోహ్లీతో పాటు గిల్ భారత స్కోరుబోర్డును నడిపించారు. లంక బౌలర్లకు ఏమాత్రం అవకాశమివ్వకుండా ఆడిన ఈ ఇద్దరూ.. క్రీజులో కుదురుకున్నాక ధాటిగా ఆడారు. రన్ రేట్ 6కు పడిపోకుండా ఆడిన ఈ ఇద్దరూ రెండో వికెట్కు 189 పరుగులు జోడించారు. అయితే సెంచరీలకు చేరువవుతున్న క్రమంలో మధుశంక భారత్కు డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. 30వ ఓవర్లో గిల్ను ఔట్ చేసిన మధుశంక.. అతడే వేసిన మరుసటి ఓవర్లో కోహ్లీని కూడా పెవిలియన్కు పంపాడు.
కోహ్లీ-గిల్లు నిష్క్రమించాక క్రీజులోకి వచ్చిన కెఎల్ రాహుల్ (19 బంతుల్లో 21, 2 ఫోర్లు) – శ్రేయాస్ అయ్యర్లు నాలుగో వికెట్కు 60 పరుగులు జోడించారు. ఉన్నంతసేపూ ఆత్మవిశ్వాసంతో ఆడిన రాహుల్.. చమీర వేసిన 40వ ఓవర్లో హేమంతకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. గత మ్యాచ్లో ఫర్వాలేదనిపించిన సూర్యకుమార్ యాదవ్ (12) ఈ మ్యాచ్లో మాత్రం తేలిపోయాడు.
అయ్యర్ అదుర్స్..
బాదడానికి ఓవర్లు.. చేతిలో వికెట్లు ఉండటంతో ఈ మ్యాచ్లో శ్రేయాస్ అయ్యర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. గత రెండు మ్యాచ్లలో విఫలమైన అతడిపై వేటు తప్పదని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో అయ్యర్.. కీలక సమయంలో బ్యాట్ ఝుళిపించాడు. కసున్ రజిత వేసిన 36వ ఓవర్లో భారీ సిక్సర్ బాదిన అయ్యర్.. తీక్షణ వేసిన 41వ ఓవర్లో లాంగాఫ్ మీదుగా అద్భుతమైన సిక్స్ కొట్టాడు. 36 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తిచేసిన అయ్యర్.. ఆ తర్వాత ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. మధుశంక వేసిన 48వ ఓవర్లో రెండు భారీ సిక్సర్లు కొట్టిన అయ్యర్.. అదే ఓవర్లో నాలుగో బంతికి భారీ షాట్ ఆడబోయి తీక్షణ చేతికి చిక్కాడు. అయ్యర్ దూకుడుతో పాటు ఆఖర్లో రవీంద్ర జడేజా (24 బంతుల్లో 35,1 ఫోర్, 1 సిక్సర్) ధాటిగా ఆడటంతో భారత్ 350 పరుగుల మైలురాయిని దాటింది.