బెంగళూరు టెస్టులో అశ్విన్, జడేజా సత్తాచాటినా కూడా సిరాజ్ స్థానంలో జట్టులోకి వచ్చిన అక్షర్ పటేల్ పెద్దగా రాణించలేదు. లంక తొలి ఇన్నింగ్స్లో కేవలం ఒక్క వికెట్ తీసిన అక్షర్.. రెండో ఇన్నింగ్స్లో తన ఎంపిక సరైనదే అని నిరూపించుకున్నాడు. మూడో రోజు ఆటలో టీ తర్వాత అశ్విన్, జడేజా వికెట్లు తీయడానికి కష్టపడుతుంటే.. అక్షర్ వికెట్ తీసుకున్నాడు.
లంక కీపర్ డిక్కవెల్లా (12)ను బోల్తా కొట్టించాడు. అక్షర్ వేసిన స్ట్రెయిట్ బంతిని డిక్కవెల్ల మిస్ అవడంతో.. వికెట్ల వెనక నుంచి దాన్ని అందుకున్న పంత్ స్టంపింగ్ చేసేశాడు. అప్పటికే ముందుకొచ్చి ఉన్న డిక్కవెల్ల తిరిగి వెనక్కు వెళ్లలేకపోయాడు. దీంతో అతను పెవిలియన్ బాటపట్టాడు. దీంతో లంక జట్టు 160/5తో నిలిచింది. లంక కెప్టెన్ కరుణరత్నే ఒక్కడే ఒంటరిపోరాటం చేస్తున్నాడు.
అతనికి ఎదుటి ఎండ్ నుంచి సహకారం కరువైంది. ఆ తర్వాత కాసేపటికే చరిత్ ఆసలంక (5)ను కూడా అక్షర్ పెవిలియన్ చేర్చాడు. అక్షర్ వేసిన క్వికర్ డెలివరీకి ఆసలంక రియాక్ట్ అవ్వలేకపోయాడు. దీంతో అతని గ్లౌవ్స్ను తాకిన బంతిని షార్ట్లెగ్లో రోహిత్ శర్మ అందుకున్నాడు. దీంతో ఆసలంక కూడా పెవిలియన్ బాటపట్టాడు. వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోవడంతో 52 ఓవర్లు ముగిసే సరికి లంక జట్టు 190/6 స్కోరుతో ఉంది. కెప్టెన్ కరుణరత్నే సెంచరీకి చేరువలో ఉన్నాడు.