Virat Kohli: వన్డే వరల్డ్ కప్లో భాగంగా సౌతాఫ్రికాతో ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా వెటరన్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వన్డేలలో సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న 49 సెంచరీల రికార్డును సమం చేశాడు. ఈడెన్ గార్డెన్స్లో శతకంతో భారత క్రికెట్ అభిమానులను పులకరింపజేసిన కోహ్లీ.. వన్డేలలో తొలి శతకం సాధించింది కూడా ఇదే వేదిక మీద కావడం గమనార్హం. ఆ వివరాలివిగో..
2008లో మలేషియా వేదికగా ముగిసిన అండర్ – 19 క్రికెట్ వరల్డ్ కప్లో భారత్ కు సారథిగా వ్యవహరించి ట్రోఫీ అందించిన కోహ్లీ.. అదే ఏడాది ఆగస్టులో భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. కొత్తలో జట్టులోకి రావడం పోవడం వంటి సమస్యలు ఎదుర్కున్న కోహ్లీ.. 2009లో స్వదేశంలో శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్లో భాగంగా నాలుగో వన్డేలో యువరాజ్ గాయపడటంతో జట్టులో చోటుదక్కించుకున్నాడు. ఇదే కోల్కతా వేదికగా జరిగిన ఆ మ్యాచ్లో 114 బంతుల్లో 107 పరుగులు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లీకి ఇదే తొలి శతకం. నిత్యం కోహ్లీపై ఏదో ఓ వివాదాస్పద వ్యాఖ్య చేసి వార్తల్లో నిలిచే గౌతం గంభీర్తో కలిసి కోహ్లీ ఆ మ్యాచ్లో మూడో వికెట్కు 224 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదుచేయడం విశేషం.
Greatness meets greatness 🤝
No. 49 for King Kohli 👑#CWC23 #INDvSA pic.twitter.com/rA65nkMGXx
— ICC (@ICC) November 5, 2023
ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. అనంతరం భారత్.. 48.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. సెహ్వాగ్ (10), సచిన్ (8) విఫలమైనా గంభీర్ (150), కోహ్లీ (107)లు శతకాలు బాది భారత్ను గెలిపించారు. తన తొలి సెంచరీ చేసిన వేదికలోనే కోహ్లీ.. 14 ఏండ్ల తర్వాత సచిన్ అత్యధిక సెంచరీల రికార్డును సమం చేయడం విశేషం.