Virar Kohli: పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ మరోసారి రికార్డుల వేటలో పడ్డాడు. ఇటీవలే భారత్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్ కప్లో సచిన్ టెండూల్కర్ 49వ సెంచరీ (వన్డేలలో)తో పాటు పలు రికార్డులను తుడిచేశాడు. ఆ మెగా టోర్నీ తర్వాత మళ్లీ బ్యాట్ పట్టబోతున్న కోహ్లీ.. సౌతాఫ్రికా టూర్లో అరుదైన రికార్డులపై కన్నేశాడు. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, నజఫ్గఢ్ నవాబ్ వీరేంద్ర సెహ్వాగ్ గతంలో నెలకొల్పిన రికార్డులకు కోహ్లీ అడుగుదూరంలో నిలిచాడు.
సౌతాఫ్రికాపై కోహ్లీ తన కెరీర్లో ఇప్పటివరకూ 14 టెస్టులు ఆడాడు. ఇందులో 56.18 సగటుతో 1236 పరుగులు సాధించాడు. ప్రస్తుతం టీమ్లో సఫారీలపై టెస్టులలో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ అతడే కానీ.. భారత్ నుంచి నాలుగో వాడు. సఫారీ జట్టుపై రాహుల్ ద్రావిడ్ 1252 పరుగులు చేయగా వీరేంద్ర సెహ్వాగ్ 15 టెస్టులలో 1306 పరుగులు చేశాడు. ద్రావిడ్ రికార్డును బ్రేక్ చేయడానికి కోహ్లీకి 16 పరుగులు కావాల్సి ఉండగా వీరూ రికార్డు కోసం 70 పరుగులు చేయాల్సి ఉంది.
The 🐐 is getting ready for South African challenge. pic.twitter.com/teWFxuiTrf
— Johns. (@CricCrazyJohns) December 24, 2023
మంగళవారం నుంచి సెంచూరియన్ వేదికగా జరగాల్సి ఉన్న తొలి టెస్టులో కోహ్లీ ఈ రికార్డులను బ్రేక్ చేసే అవకాశముంది. సౌతాఫ్రికాపై అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్లలో సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు. మాస్టర్ బ్లాస్టర్.. 25 టెస్టులలో 42.46 సగటుతో 1741 పరుగులు చేశాడు. సచిన్ రికార్డును బ్రేక్ చేయాలంటే కోహ్లీకి 505 పరుగులు కావాలి. దక్షిణాఫ్రికా టూర్లో భాగంగా భారత్ రెండు మ్యాచ్లే ఆడాల్సి ఉన్న నేపథ్యంలో సచిన్ రికార్డును బ్రేక్ చేయడం అంత ఈజీ అయితే కాదు గానీ ద్రావిడ్, వీరూల రికార్డులను అధిగమించేందుకు విరాట్కు అవకాశం ఉంది.