కొన్నిరోజులుగా టీమిండియా చుట్టూ జరుగుతున్న వివాదాలపై సంచలన ప్రెస్మీట్ నిర్వహించిన భారత టెస్టు కెప్లెన్ కోహ్లీ.. ఈ వివాదాలను మరో స్థాయికి తీసుకెళ్లాడు. ఈ ప్రెస్మీట్లో తనపై వస్తున్న వార్తలు, రోహిత్తో బంధం గురించి కూడా స్పష్టతనిచ్చాడు. తాను వన్డే సిరీస్కు దూరమవడం అబద్ధమని, తాను సెలెక్షన్కు అందుబాటులోనే ఉంటానని చెప్పాడు.
అలాగే రోహిత్తో తనకు ఎటువంటి వైరమూ లేదని మరోసారి కుండబద్దలు కొట్టాడు. అదే సమయంలో తనను ఎవరూ టీ20 కెప్టెన్సీ వదులుకోవద్దని చెప్పలేదని, వన్డే కెప్టెన్సీ గురించి ఇప్పటి వరకూ చర్చించలేదని స్పష్టం చేశాడు. సౌతాఫ్రికా టూర్ జట్టు ఎంపిక తర్వాతే తనకు ఈ విషయం చెప్పారని వెల్లడించాడు.
ఈ ప్రెస్మీట్తో క్రికెట్ ప్రపంచం భగ్గుమంది. బీసీసీఐ, గంగూలీపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు కోహ్లీ తీరును తప్పుపడుతున్నారు. అయితే వీటిని పట్టించుకోని కోహ్లీ అండ్ టీం.. ప్రెస్మీట్ అనంతరం గురువారం ఉదయం సౌతాఫ్రికా వెళ్లే విమానం ఎక్కేసింది.
విమానంలో జట్టు ఫొటోను ట్విట్టర్లో పంచుకున్న బీసీసీఐ.. ‘సౌతాఫ్రికాకు ప్రయాణం’ అంటూ ట్వీట్ చేసింది. ఈ విమానంలో భారత జట్టు దక్షిణాఫ్రికా చేరుకుంది. ఆటగాళ్లు విమానాశ్రయంలో ఉన్న ఫొటోను కూడా బీసీసీఐ ట్వీట్ చేసింది. ‘సౌతాఫ్రికాలో అడుగు పెట్టాం’ అని ట్వీట్ చేసింది. ఇక్కడ భారత జట్టు మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది.