మూడో టెస్టు అత్యంత ఉత్కంఠ భరితంగా సాగుతోంది. కోహ్లీ, పంత్ క్రీజులో ఉన్నంత సేపూ ఆధిపత్యం చెలాయించిన భారత జట్టు.. కోహ్లీ అవుటైన తర్వాత ఆత్మరక్షణలో పడింది. ముఖ్యంగా పంత్.. తన దూకుడైన ఆట ఆడలేకపోయాడు. దీంతో స్కోరుబోర్డు వేగం మందగించింది.
కోహ్లీ తర్వాత వచ్చిన అశ్విన్, శార్దూల్, షమీ, ఉమేష్, బుమ్రా ఎవరూ కూడా రెండంకెల స్కోరు చేయలేదు. అయితే ఇటువంటి క్లిష్ట పరిస్థితిలో కూడా ఎదురొడ్డిన పంత్.. సెంచరీ పూర్తిచేశాడు. ఆ తర్వాతి ఓవర్లో జాన్సెన్ బౌలింగ్లో బుమ్రా అవుటయ్యాడు. దీంతో భారత జట్టు 198 పరుగులకు ఆలౌట్ అయింది.
సఫారీల ముందు 212 పరుగుల లక్ష్యం నిలిపింది. భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (10), మయాంక్ (7), పుజారా (9), కోహ్లీ (29), రహానే (1), అశ్విన్ (7), శార్దూల్ (5), ఉమేష్ (0), షమీ (0), బుమ్రా (2) పరుగులు చేయగా.. పంత్ ఒక్కడ వంద పరుగులతో అజేయంగా నిలిచాడు.
రెండో టెస్టులో 240 పరుగుల టార్గెట్ ఛేదించిన సఫారీలను.. 212 పరుగులలోపు కట్టడి చేయడం భారత బౌలర్లకు పెద్దసవాలుగా మారనుంది. అయితే ఈ టెస్టులో కెప్టెన్ కోహ్లీ వ్యూహాలు కీలకం కానున్నాయి.