IND vs SA: దక్షిణాఫ్రికా పర్యటనలో విఫలమైన శ్రేయస్ అయ్యర్కు త్వరలో ఇంగ్లండ్తో జరుగనున్న టెస్టు సిరీస్లో చోటు కల్పించకూడదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ అతడికి దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మద్దతుగా నిలిచాడు. సఫారీ టూర్లో అతడొక్కడే విఫలమవ్వలేదని, ఆ లెక్కన చూస్తే రోహిత్, జైస్వాల్, గిల్ వంటి బ్యాటర్లు కూడా విఫలమయ్యారని గవాస్కర్ అన్నాడు. రెండు టెస్టులలో కలిపి అయ్యర్.. 41 పరుగులు మాత్రమే చేశాడు.
స్టార్ స్పోర్ట్స్లో జరిగిన చర్చా కార్యక్రమంలో సన్నీ మాట్లాడుతూ.. ‘దక్షిణాఫ్రికా టూర్లో ఫెయిల్ అయింది ఒక్క అయ్యర్ మాత్రమే కాదు.. సఫారీ పిచ్లపై పరుగులు చేయడం ఏ బ్యాటర్కైనా సవాలు వంటిదే. టీమిండియాలో చూస్తే విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ మినహా మిగతా అందరూ కనీసం డబుల్ డిజిట్ స్కోరు చేయడానికి కూడా నానా తంటాలు పడ్డారు. అయ్యర్ ఒక్కడే విఫలమయ్యాడన్నట్టుగా అతడిని బలిపశువును చేయకూడదు. సెలక్షన్ కమిటీ అతడికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలి..’ అని గవాస్కర్ చెప్పాడు.
దక్షిణాఫ్రికా టూర్లో కోహ్లీ (172), కెఎల్ రాహుల్ (113) మినహా మిగిలినవారెవరూ మూడంకెల వ్యక్తిగత స్కోరు చేయలేదు. సఫారీ పర్యటనలో భాగంగా న్యూలాండ్స్ వేదికగా ముగిసిన రెండో టెస్టులో ఇరు జట్ల నుంచి మూడంకెల స్కోరు చేసిన ఒకే ఒక బ్యాటర్ సౌతాఫ్రికా ఓపెనర్ ఎయిడెన్ మార్క్రమ్. సఫారీ రెండో ఇన్నింగ్స్లో మార్క్రమ్ వీరోచిత సెంచరీ చేశాడు.