నిర్ణయాత్మక మూడో టెస్టులో మిడిలార్డర్ వైఫల్యంతో భారత్ భారీ మూల్యం చెల్లించుకుంది. అనుభవం లేని సఫారీ జట్టు చేతిలో సిరీస్ కోల్పోయింది. అత్యుత్తమ టెస్టు జట్టుగా పరిగణించే టీమిండియా.. కనీసం పోరాటం కూడా లేకుండా మూడో టెస్టులో చిత్తయింది. మూడో ఇన్నింగ్సులో రిషభ్ పంత్ (100 నాటౌట్), విరాట్ కోహ్లీ (29) తప్ప మిగతా బ్యాటర్లెవరూ రాణించలేదు. దీంతో భారత జట్టు 198 పరుగులకే ఆలౌట్ అయింది. సఫారీల ముందు 213 పరుగుల టార్గెట్ మిగిలింది.
ఆచితూచి ఆడిన సఫారీ బ్యాటర్లు ఎయిడెన్ మార్క్రమ్ (16), డీన్ ఎల్గార్ (30), కీగన్ పీటర్సన్ (82), రాసీ వాన్ డర్ డస్సెన్ (41 నాటౌట్), టెంబా బవుమా (32 నాటౌట్) రాణించడంతో ప్రొటీస్ జట్టు సులభంగా విజయం సాధించింది. భారత మిడిలార్డర్ అత్యంత దారుణంగా విఫలమవగా.. సౌతాఫ్రికా మిడిలార్డర్ మొక్కవోని దీక్షతో విజయానికి బాటలు వేసింది.
అదే సమయంలో సఫారీ పేసర్లు నిప్పులు చెరిగిన పిచ్పై భారత బౌలింగ్ దళం వెలవెల బోయింది. దీంతో ఆధిపత్యం ప్రదర్శిస్తూ వచ్చిన సౌతాఫ్రికా బ్యాటర్లు 7 వికెట్ల తేడాతో గెలుపు రుచిచూశారు. ఫీల్డింగ్ లోపాలు కూడా భారత్ కొంప ముంచాయి. కీగన్ పీటర్సన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న కాసేపటికే క్యాచ్ ఇవ్వగా.. పుజారా దాన్ని జారవిడిచాడు. చాలా సులభమైన ఆ క్యాచ్ ఒక విధంగా మ్యాచ్ గతినే మార్చేసిందని చెప్పొచ్చు.
ఆ తర్వాత 64వ ఓవర్లో 8 పరుగులు కావలసిన సమయంలో భారత ఫీల్డర్లు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఓవర్ త్రో కారణంగా సఫారీలకు మరో ఐదు పరుగులు వచ్చాయి. ఆ తర్వాతి బంతిని బౌండరీ బాదిన బవుమా.. సపారీలకు చరిత్రాత్మక విజయం అందించాడు. సౌతాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్ గెలవాలన్న భారత ఆశలు ఆవిరి చేశాడు.