భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దెబ్బకు సఫారీలు మూడో వికెట్ కోల్పోయారు. 305 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికాను మహమ్మద్ షమీ ఆదిలోనే దెబ్బ కొట్టాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే ఓపెనర్ మార్క్రమ్ను అవుట్ చేశాడు. ఆ తర్వాత సిరాజ్ డెలివరీని సరిగా అంచనా వేయలేక కీగన్ పీటర్సన్ (17) కూడా కీపర్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
అయితే ఆ తర్వాత మరో వికెట్ పడకుండా సఫారీ కెప్టెన్ ఎల్గార్ (52 నాటౌట్), రాసీ వాన్ డర్ డస్సెన్ (11) జాగ్రత్త పడ్డారు. ముఖ్యంగా ఎల్గార్ చాలా బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం చెత్త బంతులనే ఆడుతూ.. మిగతా బంతులను వదిలేస్తూ ఎంతో సహనం ప్రదర్శించాడు.
ఈ క్రమంలోనే 15వ ఓవర్లో పీటర్సన్ అవుటైన తర్వాత 37వ ఓవర్ వరకూ వీళ్లిద్దరూ అడ్డుగోడల్లా నిలిచారు. అయితే ఆ ఓవర్లో బంతి అందుకున్న బుమ్రా.. నాలుగో బంతికి వాన్ డర్ డస్సెన్ను తన మార్క్ డెలివరీతో పెవిలియన్ చేర్చాడు. దీంతో 74 పరుగుల వద్ద సౌతాఫ్రికా మూడో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో ఎల్గార్తోపాటు నైట్ వాచ్మెన్గా కేశవ్ మహరాజ్ ఉన్నాడు.