సఫారీలతో జరుగుతున్న తొలి వన్డేలో భారత జట్టు కష్టాలు పడుతోంది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే స్వల్పస్కోరుకు కెప్టెన్ కేఎల్ రాహుల్ (12) అవుటవగా.. శిఖర్ ధావన్ (79), విరాట్ కోహ్లీ (51) అర్ధశతకాలతో రాణించారు.
వీళ్లిద్దరూ అవుటయ్యే సమయానికి 158/3తో పటిష్టంగానే కనిపించినా కూడా మిగతా బ్యాటర్లు వేగంగా ఆడలేకపోతున్నారు. ఈ క్రమంలోనే బ్యాటింగ్ వేగం పెంచేందుకు ప్రయత్నించిన శ్రేయాస్ అయ్యర్ (17).. మరోసారి షార్ట్ పిచ్ బంతికి బలయ్యాడు.
కొంతకాలంగా షార్ట్ పిచ్ బంతులతో ఇబ్బందులు పడుతున్న అతని వీక్నెస్పై ఎన్గిడీ దెబ్బకొట్టాడు. అతను వేసిన షార్ట్ బాల్ను పుల్ చేసేందుకు శ్రేయాస్ ప్రయత్నించాడు. కానీ టైమింగ్ సరిగా కుదరకపోవడంతో చాలా స్వల్పంగా టాప్ ఎడ్జ్ తీసుకున్న బంతి కీపర్ డీకాక్ వైపు వెళ్లింది. దాన్ని సులభంగా అందుకున్న అతను శ్రేయాస్ను పెవిలియన్ చేర్చాడు.
ఆ తర్వాత కాసేపటికే రిషభ్ పంత్ కూడా వెనుతిరిగాడు. ఫెక్లుక్వేయా వేసిన బంతిని ఆడేందుకు ప్రయత్నించిన పంత్.. బ్యాలెన్స్ నిలుపుకునేందుకు క్రీజు వదిలి ముందుకొచ్చాడు. అయితే అతని బ్యాట్ను బంతి మిస్ అయింది. దాన్ని అందుకున్న డీకాక్ క్షణంలో వికెట్లను పడగొట్టాడు. దీంతో పంత్ ఇన్నింగ్స్ ముగిసింది. భారత జట్టు 185/5తో కష్టాల్లో పడింది.