ఛేదించాల్సిన లక్ష్యం భారీగా లేకపోవడంతో ఆత్మవిశ్వాసంతో ఇన్నింగ్స్ ఆరంభించిన సఫారీలు.. మంచి ఓపెనింగ్ సాధించారు. ముఖ్యంగా ఎయిడెన్ మార్క్రమ్ (31) వన్డే తరహాలో బ్యాటింగ్ చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఇతనికి కెప్టెన్ డీన్ ఎల్గార్ (16 నాటౌట్) మంచి సహకార అందించడంతో.. ప్రొటీస్ 47 పరుగులు చేసింది.
వీళ్ల బ్యాటింగ్ తీరు చూస్తే భారత్ నిర్దేశించిన 240 పరుగుల లక్ష్యం సరిపోదేమో అనిపించింది. అయితే తొలి ఇన్నింగ్స్లో సౌతాఫ్రికా బ్యాటర్లకు ముచ్చెమటలు పోయించిన శార్దూల్ ఠాకూర్ ఈ ఇన్నింగ్సులో కూడా సత్తా చాటాడు. బ్యాటుతో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడిన అతను.. భారత్కు తొలి బ్రేక్ ఇచ్చాడు.
ధాటిగా ఆడుతున్న మార్క్రమ్ను ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. ఫుల్ లెంగ్త్లో అతను వేసిన బంతి మార్క్రమ్ బ్యాట్ను తప్పించుకొని వెనుక ప్యాడ్ను తాకింది. బంతి తక్కువ ఎత్తులో కూడా రావడంతో కనీసం రివ్యూ కోరాలనే ప్రయత్నం కూడా చేయకుండా మార్క్రమ్ పెవిలియన్కు చేరుకున్నాడు. ప్రస్తుతం ఎల్గార్కు కీగన్ పీటర్సన్ జతచేరాడు.