Virat Kohli: సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా వెటరన్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈడెన్ గార్డెన్స్లో సచిన్ టెండూల్కర్ వన్డేలలో నెలకొల్పిన 49వ సెంచరీల రికార్డును సమం చేసిన విషయం తెలిసిందే. అసలు మాస్టర్ బ్లాస్టర్ రికార్డును బ్రేక్ చేయడం గురించి పక్కనబెడితే ఆ దరిదాపుల్లోకి కూడా ఎవరూ వెళ్లరని గతంలో వ్యాఖ్యానించిన వారు సైతం తాజాగా కోహ్లీ రికార్డుతో అతడిపై ప్రశంసలు కురిపిస్తున్న తరుణంలో స్వయంగా మాస్టర్ బ్లాస్టర్ స్పందించాడు.
కోహ్లీ 49వ శతకం తర్వాత సచిన్ తన సోషల్ మీడియా ఖాతాల వేదికగా స్పందిస్తూ.. ‘చాలా బాగా ఆడావు విరాట్. నాకు 49 నుంచి 50కి చేరడానికి 365 రోజుల టైమ్ పట్టింది. కానీ నీవు మాత్రం 49 నంచి 50కి చేరి రాబోయే కొన్ని రోజులలోనే నా రికార్డును బ్రేక్ చేస్తావని ఆశిస్తున్నా. కంగ్రాట్యూలేషన్స్.. ’ అని పోస్ట్ చేశాడు. సచిన్ రికార్డు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
కాగా ఈ ఏడాది ఏప్రిల్లో సచిన్ 50వ పడిలోకి అడుగిడిన విషయం తెలిసిందే. దానిని ఉద్దేశించే మాస్టర్ బ్లాస్టర్ ఈ ట్వీట్ చేశాడు. 49 ఏండ్ల నుంచి 50 ఏండ్లకు చేరడానికి తనకు 365 రోజులు పట్టాయని.. కానీ కోహ్లీకి మాత్రం 49 సెంచరీల నుంచి 50 సెంచరీలకు చేరడానాకి రాబోయే కొద్దిరోజులు సరిపోతాయని అర్థం వచ్చేలా సచిన్ పోస్టులో పేర్కొన్నాడు.
సచిన్.. తన సుదీర్ఘ వన్డే కెరీర్లో 452 ఇన్నింగ్స్లో 49 సెంచరీలు చేయగా కోహ్లీ మాత్రం 277 ఇన్నింగ్స్లలోనే ఈ ఘనతను అందుకున్నాడు. అంతర్జాతీయంగా వన్డేలలో అత్యధిక సెంచరీలు చేసిన వారిలో టాప్ -3 బ్యాటర్లు భారత్కు చెందినవారే కావడం గమనార్హం. 49 సెంచరీలతో సచిన్, విరాట్లు అగ్రస్థానంలో ఉండగా 31 సెంచరీలు చేసిన రోహిత్ శర్మ మూడో స్థానంలో ఉన్నాడు. 30 శతకాలతో రికీ పాంటిగ్ నాలుగో స్థానంలో నిలిచాడు.