వన్డే కెప్టెన్ పదవి నుంచి తొలగించిన తర్వాత తొలిసారి కేవలం ఆటగాడిగా మాత్రమే బ్యాటింగ్ చేస్తున్న కోహ్లీ.. అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో పూర్తి నియంత్రణతో బ్యాటింగ్ చేశాడు. ధావన్(79)తో కలిసి 92 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.
అనంతరం 26వ ఓవర్లో భారత జట్టు స్కోరు 138 పరుగులుగా ఉన్నప్పుడు ధావన్ అవుటయ్యాడు. కేశవ్ మహరాజ్ బౌలింగ్లో బౌల్డ్ అయి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత 29వ ఓవర్ రెండో బంతికి కోహ్లీ కూడా వెనుతిరిగాడు.
తబ్రయిజ్ షంసీ వేసిన బంతిని స్వీప్ చేసేందుకు కోహ్లీ ప్రయత్నించాడు. అయితే బంతి అంత ఫుల్ లెంగ్త్ కాకపోవడంతో టాప్ ఎడ్జ్ తీసుకుంది. మిడ్ వికెట్లో ఫీల్డింగ్ చేస్తున్న సఫారీ కెప్టెన్ బవుమాకు సులభమైన క్యాచ్ వెళ్లింది.
దీంతో 51 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లీ పెవిలియన్ చేరాడు. రెండు కీలకమైన వికెట్లు కోల్పోయిన తర్వాత శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్ క్రీజులో ఉన్నారు. 30 ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు 156/3 స్కోరుతో నిలిచింది.