దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ అదరగొట్టాడు. శతకంతో సౌతాఫ్రికా గడ్డపై సత్తాచాటాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి నిలకడగా ఆడుతున్న రాహుల్.. 218 బంతుల్లో శతకం సాధించాడు. కేశవ్ మహరాజ్ వేసిన ఇన్నింగ్స్ 78వ ఓవర్లో ఫోర్తో సెంచరీ పూర్తి చేశాడు. ఇది టెస్టు క్రికెట్లో రాహుల్కు ఏడో శతకం. ఈ శతకంతో రాహుల్ మరో అరుదైన ఘనత కూడా సాధించాడు. ఇప్పటి వరకూ తాను ఆడిన ప్రతి దేశంలోనూ సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
రాహుల్తో కలిసి ఓపెనింగ్ చేసిన మయాంక్ అగర్వాల్ (60) కూడా అర్ధశతకంతో సత్తాచాటడంతో తొలి టెస్టు తొలిరోజు ఆటలో భారత జట్టు ఆధిపత్యం చెలాయిస్తోంది. మిగతా బ్యాటర్లలో ఛటేశ్వర్ పుజారా (0) గోల్డెన్ డక్గా అవుటవగా.. కెప్టెన్ కోహ్లీ (35) అనవసర షాట్కు ప్రయత్నించి వికెట్ సమర్పించుకున్నాడు. ప్రస్తుతం రాహుల్(111 నాటౌట్)తో పాటు క్రీజులో అజింక్య రహానే (32 నాటౌట్) ఉన్నాడు.