సఫారీలతో జరుగుతున్న రెండో టెస్టు చివర్లో హైదరబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ గాయంతో మైదానాన్ని వీడాడు. మరొక ఓవర్ ఆట మిగిలి ఉందనగా సిరాజ్.. హ్యామ్స్ట్రింగ్ నొప్పితో విలవిల్లాడాడు. దీంతో మైదానంలోకి వచ్చిన ఫిజియో అతన్ని డగౌట్కు తీసుకెళ్లాడు. ఇలా గాయపడిన సిరాజ్.. రెండో రోజు ఆటలో బౌలింగ్కు వస్తాడా? అని అనుమానాలు తలెత్తుతున్నాయి.
ఈ క్రమంలో తొలిరోజు ఆట ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన అశ్విన్ ఈ విషయంపై అప్డేట్ ఇచ్చాడు. మీటింగ్కు వచ్చే ముందు మెడికల్ టీంతో ఇదే విషయం చర్చించానని, సిరాజ్ గాయం గురించి మీడియతో మాట్లాడొచ్చా? అని అడిగానని అశ్విన్ వెల్లడించాడు. వారి పర్మిషన్తోనే సిరాజ్ విషయంపై వివరణ ఇచ్చాడు.
ఇది సడెన్గా జరగడంతో ఐస్ పెట్టి గంట, రెండు గంటలు పరిశీలిస్తారని, ఆపై సిరాజ్ ఆడే విషయంపై నిర్ణయం తీసుకుంటారని చెప్పాడు. అయితే సిరాజ్ స్వభావం, అతనికి ఇలా గాయాలయిన చరిత్రను బట్టి చూస్తే.. అతను కచ్చితంగా మైదానంలో దిగి, జట్టు కోసం బెస్ట్ పెర్ఫామెన్స్ ఇస్తాడని ఈ వెటరన్ స్పిన్నర్ పేర్కొన్నాడు. ఒకవేళ సిరాజ్ కనుక బౌలింగ్ చేయలేకపోతే, బౌలింగ్ భారాన్ని కచ్చితంగా అశ్విన్ కూడా పంచుకోవాల్సి వస్తుంది.