అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన న్యూజిల్యాండ్, భారత్ మధ్య తొలి టెస్టులో ఒక ఆసక్తికర దృశ్యం కంటబడింది. ఐదో రోజు మ్యాచ్లో గల్లీ పాయింట్లో మయాంక్ ఫీల్డింగ్ చేశాడు. ఈ సమయంలో అందరు ఫీల్డర్లలా కిందకు వంగి నిలబకుండా మోకాళ్లపై కూర్చున్నాడు. దీంతో ఇలా చేయడం కరెక్టేనా? అనే అనుమానాలు తలెత్తాయి.
కాన్పూర్ పిచ్పై బౌన్స్ తగ్గిపోవడంతో బౌలర్లు వేసిన బంతులు ఎడ్జ్ తీసుకోవడం లేదు. ఒక వేళ తీసుకున్నా ఎక్కువ ఎత్తుకు ఎగరడం లేదు. అందుకే మయాంక్ ఇలా మోకాళ్లపై కూర్చొని ఫీల్డింగ్ చేశాడు. అయితే ఇలా చేయడం క్రికెట్ రూల్స్కు విరుద్ధమేమీ కాదని ఈ క్రీడకు సంబంధించి రూల్స్ చేసే ఎంసీసీ అధికారి తెలిపారు.
ఎంసీసీ సలహాదారుల్లో ఒకరైన జానీ సింగర్ దీనిపై స్పందించారు. ప్రస్తుత మోడ్రన్ క్రికెట్లో ఇలా మోకాళ్లపై కూర్చొని ఫీల్డింగ్ చేయడం సాధారణంగా మారిపోయిందని ఆయన అన్నారు. ‘ఒక ఆటగాడు మోకాళ్లపై కూర్చొని ఫీల్డింగ్ చేయకూడదని చెప్పే చట్టం లేదు. కాబట్టి మోకాళ్లపై కూర్చొని ఫీల్డింగ్ చేయడం తప్పేమీ కాదు’ అని వివరించారు.
అయితే బౌలర్ బంతి వేసిన తర్వాత గనుక ఎవరైనా ఫీల్డర్ మోకాళ్లపై కూర్చున్నా, లేదంటే మోకాళ్లపై కూర్చొని ఉన్న వాడు లేచి నిలబడినా తప్పవుతుందని చెప్పారు. ఇలా చేయడం క్రికెట్ చట్టంలోని 28.6.1 సెక్షన్ను ఉల్లంఘించడమేనన్నారు.
ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలనే నిర్ణయం ఆన్ఫీల్డ్ అంపైర్ చేతుల్లో ఉంటుందని పేర్కొన్నారు. కాగా, ఈ టెస్టు మ్యాచ్లో కివీస్ బ్యాట్స్మెన్ అసాధారణ పోరాటం కనబరచడంతో ఈ మ్యాచ్ డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే.