భారత్, న్యూజిల్యాండ్ తొలి టెస్టు అనూహ్యంగా డ్రా అయింది. ఈ మ్యాచ్లో కివీ హీరోలు రచిన్ రవీంద్ర, అజాజ్ పటేల్ అందరి దృష్టినీ ఆకర్షించారు. శుక్రవారం నుంచి రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఈ క్రమంలో తొలి టెస్టు హీరోల్లో ఒకరైన అజాజ్ పటేల్ మీడియాతో మాట్లాడాడు. సిరీస్ గెలిచే లక్ష్యంతోనే తాము రెండో టెస్టు ఆడతామని ఈ స్పిన్నర్ వెల్లడించాడు.
‘భారత్లో గెలవడం కష్టమని మాకు తెలుసు. కానీ ఎటువంటి పరిస్థితిలోనైనా పోరాడగలమనే నమ్మకం మాకుంది’ అని అజాజ్ పటేల్ తెలిపాడు. అదే సమయంలో వాంఖడే స్టేడియంలో ఆడటం తనకు ఎన్నో విషయాలు గుర్తు చేస్తుందన్నాడు. తన కుటుంబం ముంబైలోనే ఉండేదని, ఇంతకు ముందు కూడా చాలాసార్లు ముంబై వచ్చానని పటేల్ చెప్పాడు.
ఐపీఎల్ సమయంలో మెక్లెనగన్ సాయంతో నెట్స్లో కొన్నిసార్లు బౌలింగ్ చేశానని గుర్తుచేసుకున్నాడు. తాను ముంబై వచ్చిన ప్రతిసారీ కుటుంబం, స్నేహితులను కలిసే వాడినని చెప్పిన అతను.. ఈసారి మాత్రం న్యూజిల్యాండ్ తరఫున క్రికెట్ ఆడటం కోసం రావడం భిన్నమైన అనుభూతని వెల్లడించాడు.
అయితే తొలి టెస్టులో జట్టుకు దూరమైన కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ టెస్టులో భారత జట్టుకు సారధ్యం వహిస్తాడు. కోహ్లీ చేరికతో భారత బ్యాటింగ్ లైనప్ మరింత బలంగా మారుతుందనడంలో ఎటువంటి సందేహం లేదని నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలో రెండో టెస్టులో భారత జట్టే ఫేవరెట్గా బరిలో దిగుతోంది.