టీ20 క్రికెట్లోనే మజా ఉంటుందనుకునే వారికి కనువిప్పు కలిగిస్తూ.. చివరి గంటసేపు టెన్షన్తో విలవిల్లాడేలా కివీస్, భారత్ తొలి టెస్టు సాగింది. భారత విజయానికి 10 వికెట్లు కావల్సిన తరుణంలో స్పిన్నర్లు చెలరేగారు. వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ భారత విజయానికి బాటలు వేశారు.
కానీ చివరకు ఒకే ఒక్క వికెట్ తీయలేక మ్యాచ్ను డ్రాగా ముగించాల్సి వచ్చింది. ఈ క్రెడిట్ మొత్తం కివీ బ్యాటర్లు రచిన్ రవీంద్ర (90 బంతుల్లో 18 నాటౌట్), అజాజ్ పటేల్ (23 బంతుల్లో 2)కే దక్కుతుంది. వీళ్లిద్దరూ ఎటువంటి అనవసరమైన షాట్లకు వెళ్లకుండా. మ్యాచ్ను డ్రా చేయడమే తమ లక్ష్యంగా ఆడారు.
దీంతో ఉత్కంఠభరితంగా సాగిన తొలి టెస్టు చివరిరోజున కివీస్ 165/9తో మ్యాచ్ను డ్రాగా ముగించింది. భారత బౌలర్లలో జడేజా 4, అశ్విన్ 3, అక్షర్ 1, ఉమేష్ ఒక వికెట్ తీశారు.
అడ్డుగోడలా రచిన్ రవీంద్ర
సీనియర్ బ్యాటర్లు వరుసగా సింగిల్ డిజిట్ పరుగులకే పెవిలియన్కు క్యూ కట్టారు. భారత స్పిన్నర్లు తెగ తిప్పేస్తున్నారు. పిచ్పై బౌన్స్ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో భారత విజయం లాంఛనమే అనుకున్నారంతా. కానీ వారి ఆశలపై రచిన్ రవీంద్ర (90 బంతుల్లో 18 నాటౌట్), అజాజ్ పటేల్ (23 బంతుల్లో 2) నీళ్లు చల్లారు. భారత స్పిన్ దాడిని ఎదుర్కొంటూ జట్టు ఓటమికి అడ్డుకట్ట వేశారు. దీంతో భారత్-న్యూజిల్యాండ్ తొలి టెస్టు డ్రాగా ముగిసింది.
ప్రతి ఓవర్కూ లైటింగ్ చెక్..
ఇన్నింగ్స్ చివర్లో భారత బౌలర్లు ఓవర్ వేయడానికి వచ్చిన ప్రతిసారీ.. అంపైర్ నితిన్ మీనన్ లైటింగ్ చెక్ చేస్తూ మరింత ఉత్కంఠ పెంచాడు. ఒక్క వికెట్ పడగొడితే విజయం భారత వశం అవుతుందనే సమయంలో.. నితిన్ మీనన్ లైట్ చెక్ చేయడం అభిమానుల్లో మరింత టెన్షన్ పెంచింది. అయితే చివరకు పూర్తి కోటా ఓవర్లు వేసినా.. రచిన్, పటేల్ జోడీ భారత విజయాన్ని అడ్డుకుంది.