కివీస్పై టీమిండియా వరుసగా రెండో మ్యాచ్లోనూ విజయం సాధించింది. రాంచీలోని జేఎస్సీఏ మైదానంలో జరుగుతున్న రెండో టీ20లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కివీస్.. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 153 పరుగులు మాత్రమే చేయగలిగింది.
లక్ష్య ఛేదనలో భారత్కు కేఎల్ రాహుల్ (65), రోహిత్ శర్మ (55) అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. ఇద్దరూ అర్ధశతకాలతో చెలరేగడంతో భారత్ సునాయాసంగా గెలుస్తుందనిపించింది. కానీ రాహుల్ అవుటవడం, ఆ తర్వాత హాఫ్ సెంచరీ పూర్తయిన వెంటనే రోహిత్ అవుటవడంతో కొంత ఉత్కంఠ నెలకొంది.
ఇలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (1) కూడా వెంటనే పెవిలియన్ చేరాడు. దీంతో క్రిజులోకి వచ్చిన పంత్.. 18వ ఓవర్ తొలి రెండు బంతులకు రెండు సిక్సర్లు బాది భారత్కు విజయాన్ని కట్టబెట్టాడు. దీంతో భారత్ మరో 16 బంతులు మిగిలుండగానే న్యూజిల్యాండ్పై 7 వికెట్ల తేడాతో ఘనవిజయం నమోదు చేసింది.
ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్ భారత్ వశమైంది. కివీస్ బౌలర్లలో టిమ్ సౌథీ ఒక్కడే మూడు వికెట్లు పడగొట్టాడు.