స్పిన్కు అనుకూలిస్తున్న పిచ్పై భారత బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. 326 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన కివీస్ జట్టును ఆరంభంలో మహమ్మద్ సిరాజ్ దెబ్బకొట్టాడు. 4 ఓవర్లే వేసిన అతను మూడు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. మరో ఎండ్ నుంచి ఉమేష్ యాదవ్ ఒత్తిడి పెంచుతుంటే.. సిరాజ్ వికెట్లు పడగొట్టాడు.
ఆ తర్వాత బంతి అందుకున్న అశ్విన్ 4 వికెట్లు పడగొట్టాడు. వీరితో పాటు అక్షర్ పటేల్ 2, జయంత్ యాదవ్ 1 వికెట్ పడగొట్టారు. భారత బౌలర్లు సమిష్టిగా రాణించడంతో కివీస్ బ్యాట్స్మెన్ ఏ దశలోనూ కోలుకునేలా కనిపించలేదు. న్యూజిల్యాండ్ ఆటగాళ్లలో తాత్కాలిక కెప్టెన్ టామ్ లాథమ్ (10), కైల్ జేమీసన్ (17) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు.
మిగతా ఆటగాళ్లంతా 10 పరుగులు కూడా చేయకుండానే పెవిలియన్ చేరారు. దీంతో ఆ జట్టు 62 పరుగులకే ఆలౌట్ అయింది. భారత్పై ఆడుతూ టెస్టుల్లో ఇంత తక్కువ స్కోరుకే ఒక జట్టు ఆలౌట్ అవడం ఇదే తొలిసారి. అలాగే భారతదేశంలో ఆడుతూ ఒక జట్టు చేసిన అత్యంత తక్కువ స్కోరు ఇదే కావడం గమనార్హం. అయితే 263 పరుగుల ఆధిక్యంలో ఉన్న భారత్.. న్యూజిల్యాండ్కు ఫాలో ఆన్ ఇవ్వడానికి నిరాకరించింది. భారత్ రెండో ఇన్నింగ్స్ ఆడుతోంది.