కివీస్ ఓపెనర్లు మార్టిన్ గప్తిల్ (31), డారియల్ మిచెల్ (31) ఇచ్చిన ఆరంభం చూస్తే న్యూజిల్యాండ్ జట్టు 200 పరుగులు చేసేలా కనిపించింది. కానీ వారిద్దరూ అవుటైన తర్వాత అద్భుతంగా పుంజుకున్న భారత బౌలర్లు ఆ జట్టును కట్టడి చేశారు. భారీ షాట్లు ఆడకుండా అడ్డుకున్నారు.
కివీస్ బ్యాట్స్మెన్ అతి కష్టం మీద పరుగులు చేయాల్సి వచ్చింది. మార్క్ చాప్మన్ (21), గ్లెన్ ఫిలిప్స్ (34) కూడా రాణించారు. కానీ టిమ్ సేఫెర్ట్ (13), జేమ్స్ నీషమ్ (3) ఘోరంగా విఫలమయ్యారు. మిచెల్ శాంట్నర్ (8 నాటౌట్), ఆడమ్ మిల్నే (5 నాటౌట్) పరుగులు చేశారు.
దీంతో 20 ఓవర్లు ముగిసే సరికి కివీస్ జట్టు 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు మాత్రమే చేయగలిగింది. అరంగేట్ర ఆటగాడు హర్షల్ పటేల్ రెండు వికెట్లతో సత్తా చాటాడు. మిగతా వారిలో అశ్విన్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్ తలో వికెట్ పడగొట్టారు.