IND vs NZ : సిరీస్ విజేతను నిర్ణయించే మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. 168 పరుగుల తేడాతో న్యూజిలాండ్ను చిత్తు చిత్తుగా ఓడించింది. 13 ఓవర్లో ఉమ్రాన్ మాలిక్ వేసిన 13వ ఓవర్లో మిచెల్ క్యాచ్ ఔట్ అయ్యాడు. దాంతో, 66 పరుగులకే కివీస్ ఇన్నింగ్స్ ముగిసింది. భారత్ 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది. ఆ జట్టులో మిచెల్ (35) టాప్ స్కోరర్. ఏకంగా నలుగురు (చాప్మన్, ఫెర్గూసన్, సోధి, లీస్టర్) డకౌట్ అయ్యారు. భారత బౌలర్ల ధాటికి ఆ జట్టు కనీస పోరాటం చేయలేకపోయింది. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా నాలుగు వికెట్లు, అర్ష్దీప్ సింగ్, శివం మావి, ఉమ్రాన్ మాలిక్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఎంచుకున్న భారత్ శుభ్మన్ గిల్ (126) సెంచరీ బాదడంతో 234 రన్స్ చేసింది. రాహుల్ త్రిపాఠి (44), సూర్యకుమార్ (24), పాండ్యా (30) రాణించారు. 235.. టార్గెట్తో బరిలోకి దిగిన న్యూజిలాండ్ భారత బౌలర్ల ధాటికి విలవిలలాడింది. ఆశ్చర్యంగా ఈ మ్యాచ్లో పేసర్లు చెలరేగారు. వెంట వెంటనే వికెట్లు తీస్తూ కివీస్ను ఒత్తిడిలోకి నెట్టారు.
తొలి ఓవర్లోనే వికెట్
తొలి ఓవర్లోనే హార్దిక్ పాండ్యా ఓపెనర్ ఫిన్ అలెన్(3)ను ఔట్ చేసి న్యూజిలాండ్ను దెబ్బకొట్టాడు. సూర్య కళ్లు చెదిరే రెండు క్యాచ్లతో ఫిలిప్స్, అలెన్ పెవలియన్ చేరారు. ఆ తర్వాత అర్ష్దీప్ సింగ్ కాన్వే, చాప్మన్ను వెనక్కి పంపాడు. దాంతో 13 రన్స్కే 4 వికెట్లు.. 21 పరుగులకే 5 వికెట్లు.. 53కే 7 వికెట్లు.. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ సాగిందిలా. ఉమ్రాన్ మాలిక్ ప్రమాదకరమైన బ్రాస్వెల్ను బౌల్డ్ చేశాడు. శివం మావి ఒకే ఓవర్లో శాంటర్న్, సోధిని ఔట్ చేశాడు. దాంతో, 10 ఓవర్లకు ఆ జట్టు 8 వికెట్ల నష్టానికి 56 రన్స్ చేసింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా మిచెల్ ఒంటరి పోరాటం చేశాడు. అతడిని ఉమ్రాన్ ఔట్ చేయడంతో కివీస్ ఇన్నింగ్స్కు తెరపడింది.
శుభ్మన్ వీర బాదుడు
తొలి రెండు మ్యాచుల్లో విఫలమైన శుభ్మన్ గిల్ కీలకమైన మూడో టీ20ల్లో విధ్యంసక ఇన్నింగ్స్ ఆడాడు. పొట్టి క్రికెట్లో తొలి శతకం నమోదు చేశాడు. అతని ఇన్నింగ్స్లో 12 ఫోర్లు 7 సిక్సర్లు ఉన్నాయి. 200 స్ట్రయిక్రేటుతో బ్యాటింగ్ చేసిన అతను అద్వితీయ షాట్లతో అహ్మదాబాద్ స్టేడియాన్ని ఓరెత్తించాడు. 35 బంతుల్లో 50 రన్స్ చేసిన అతను ఆ తర్వాతి 19 బంతుల్లోనే అంటే.. 54 బంతల్లోనే శతకం చేయడం విశేషం. రాహుల్ త్రిపాఠి (44)తో కలిసి 87 రన్స్ జోడించాడు. ఆ తర్వాత వైస్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కెప్టెన్ పాండ్యాతో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఆ జట్టుపై టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అంతేకాదు ఈ ఫార్మాట్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన భారత క్రికెటర్గా రికార్డు సృష్టించాడు.
భారత శతక వీరులు వీళ్లే
ఇండియా తరఫున మూడు పార్మాట్లలో శతకం బాదిన ఐదో ఆటగాడిగా శుభ్మన్ గిల్ నిలిచాడు. ఇంతకు ముందు సురేశ్ రైనా, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ ఈ రికార్డు సాధించారు. వీళ్లు టెస్టులు, వన్డేలు, టీ20ల్లో శతకాలు బాదారు.