IND vs NZ | టెస్టు క్రికెట్లో రాజ్యమేలుతున్న దేశాన్ని వారి సొంతగడ్డపై ఓడించాలని ప్రతి జట్టుకూ ఉంటుంది. ఒకప్పుడు వెస్టిండీస్, తర్వాత ఆస్ట్రేలియా అత్యంత పటిష్టమైన టెస్టు జట్లుగా ఒక వెలుగు వెలిగాయి. ఆ సమయంలో కూడా ఎన్నో జట్లు ఆ దేశాలను వాటి సొంతగడ్డపై ఓడించాలని ప్రయత్నించాయి. ఈసారి భారత్ వంతు వచ్చింది. ప్రస్తుత టెస్టు క్రికెట్లో అత్యంత బలమైన జట్లలో కోహ్లీసేన ఒకటి.
ముఖ్యంగా స్వదేశంలో టీమిండియాను ఓడించడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. ఇప్పటివరకూ స్వదేశంలో టీమిండియా 32 టెస్టు మ్యాచులు ఆడింది. వాటిలో కేవలం రెండంటే రెండు మ్యాచ్లు మాత్రమే ఓడింది. ఐదు డ్రాగా ముగిశాయి. మిగతా మ్యాచులన్నింటినీ భారత్ తన ఖాతాలో వేసుకుంది. వీటిలో సుమారు పది మ్యాచులు ఇన్నింగ్స్ తేడాతో నమోదైన విజయాలు కావడం విశేషం.
అంతేకాదు, మరో ఆరు మ్యాచుల్లో 200+ పరుగులు తేడాతో గెలిస్తే, నాలుగింట 8 వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది. స్వదేశంలో ఇంత బలంగా ఉన్న టీమిండియాను ఎలాగైనా ఓడిస్తామని 2017లో ఇంగ్లండ్ కెప్టెన్ జోరూట్ అన్నాడు. కానీ భారత పర్యటనలో ఆ జట్టు 1-3తో ఓటమిపాలైంది. ఇప్పుడు న్యూజిల్యాండ్ కూడా రెండు టెస్టుల సిరీస్ను గెలవాలని తహతహలాడుతోంది.
ఆ జట్టు కోచ్ గ్యారీ స్టెడ్ మాట్లాడుతూ.. ‘భారత్ వెళ్లి టెస్టు మ్యాచ్లు గెలవడం అనేది అత్యంత కఠినమైన క్రికెట్ సవాళ్లలో ఒకటి. అది ఎంత కష్టమో మాకు తెలుసు’ అని చెప్పాడు. ఈ క్రమంలో భారత్ను స్వదేశంలో ఓడించాలంటే విజిటింగ్ జట్ల దగ్గర పాటించాల్సిన ఐదు ముఖ్యమైన రూల్స్ ఏంటో చూద్దామా?
మొన్నజరిగిన టీ20 ప్రపంచకప్లో భారత జట్టు ఓటమిలో టాస్ ముఖ్యపాత్ర పోషించింది. మరి భారత్లో టెస్టు మ్యాచుల్లో కూడా టాస్ కీలకం కానుందా? అంటే కాదనే చెప్పాలి. ఎందుకంటే స్వదేశంలో భారత్ ఆడిన టెస్టుల్లో 17 సార్లు టీమిండియా టాస్ గెలిచింది. వీటిలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. అయితే టాస్ ఓడిన 15 మ్యాచుల్లో కూడా పది టెస్టులు గెలిచింది. మిగిలిన వాటిలో రెండింట ఓడిపోగా, మూడు డ్రాగా ముగిశాయి.
అయితే టాస్ గెలిస్తే విజిటింగ్ జట్లకు కొంత గెలిచే ఆశ కలుగుతుందనడంలో మాత్రం సందేహం లేదు. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం మొదట బ్యాటింగ్ చేయడం. ఎందుకంటే భారత్ మొత్తమ్మీద 17 సార్లు టాస్ గెలిచింది. వీటిలో 15 సార్లు టీమిండియా మొదట బ్యాటింగ్ చేసి భారీ విజయాలు నమోదు చేసింది. ఒకే ఒక్కసారి 2015లో బెంగళూరు వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో బౌలింగ్ ఎంచుకుంది. అయితే ఆ మ్యాచ్ వర్షం కారణంగా డ్రా అయింది. భారత్ ఓడిన రెండు మ్యాచుల్లో కూడా మొదట బౌలింగే చేసింది.
భారత్లో ఆడే ప్రత్యర్థి జట్లు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశం తొలుత బ్యాటింగ్ చేయడం ఒక్కటే కాదు. స్కోరు చేయడం కూడా. స్వదేశంలో భారత్ ఓడిన రెండు మ్యాచులు, అలాగే డ్రా చేసుకున్న రెండింట్లో కూడా ప్రత్యర్థి టాపార్డర్ బలంగా నిలబడింది. అంటే తొలి 40 ఓవర్లలో మూడు లేదా అంతకంటే తక్కువ వికెట్లే కోల్పోయిందన్నమాట. భారత్ ఓడిన లేదా డ్రా చేసుకున్న వాటిలో 2017లో ఆస్ట్రేలియా మ్యాచ్ తప్ప, మిగతా అన్ని టెస్టుల్లో ప్రత్యర్థి జట్లు తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోరు చేశాయి.
ఈ లెక్కన తొలి ఇన్నింగ్స్లో 450 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేయాలనే లక్ష్యంతో ప్రత్యర్థి జట్లు బరిలో దిగాలి. ఇలా బౌలర్లు 450 పరుగులు సమర్పించుకున్న ఒక మ్యాచ్లో భారత్ ఓడింది. అదే 2016లో చెన్నై వేదికగా ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్. ఇలా తొలి ఇన్నింగ్స్లో 300 కన్నా తక్కువ పరుగులు చేసి ఆస్ట్రేలియా జట్టు మాత్రమే భారత్పై పూణేలో 2017లో గెలిచింది.
అదే సమయంలో చివరి ఇన్నింగ్స్లో భారత్కు ప్రత్యర్థి జట్లు కనీసం 150 పరుగుల లక్ష్యం నిర్దేశించాల్సి ఉంటుంది. 2021లో ఇంగ్లండ్ జట్టు 441 పరుగులు, 2017 పూణే టెస్టులో ఆస్ట్రేలియా 420 పరుగుల లక్ష్యాలను చివరి ఇన్నింగ్స్లో నిర్దేశించాయి. ఈ రెండుసార్లూ భారత్ ఓటమిపాలైంది. ఆ తర్వాత 2016లో రాజ్కోట్లో జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్ 310 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. ఆ మ్యాచ్ డ్రా అయింది.
ఆ తర్వాత మరే జట్టూ కూడా భారత్కు చివరి ఇన్నింగ్స్లో 150+ టార్గెట్ను కూడా ఇవ్వలేకపోయాయి. ఓవరాల్గా చూసుకున్న చివరి ఇన్నింగ్స్లో 150+ స్కోరు ఛేజ్ చేయాల్సి వచ్చినప్పుడు కోహ్లీ సేన తడబడింది. స్వదేశాలు, విదేశాలు మొత్తం కలుపుకొని 12 మ్యాచుల్లో చివరి ఇన్నింగ్స్లో 150పైగా పరుగులను టీమిండియా ఛేజ్ చేయాల్సి వచ్చింది. వీటిలో 9సార్లు ఓడిపోగా, 2 డ్రాగా ముగిశాయి.
భారత పర్యటనకు వచ్చే ప్రతి జట్టుకూ పెద్ద తలనొప్పి రవిచంద్రన్ అశ్విన్. కొత్తబంతితో అద్భుతాలు చేసే అశ్విన్.. కోహ్లీ సారధ్యంలో స్వదేశంలో 48 ఇన్నింగ్సుల్లో బౌలింగ్ చేశాడు. వీటిలో 29 వికెట్లు పడగొట్టాడు. అతని యావరేజ్ 24.62కాగా, స్ట్రైక్ రేట్ 48.48. మరే భారత బౌలర్ కూడా ఇంత అద్భుతంగా బౌలింగ్ చేయలేదనడం అతిశయోక్తేమీ కాదు. అంటే ప్రత్యర్థి జట్లు అశ్విన్ను ఎదుర్కోవడానికి చాలా శ్రమపడాలి.
న్యూజిల్యాండ్ సారధి కేన్ విలియమ్సన్ కూడా 2016 భారత పర్యటనలో ఐదుసార్లు అశ్విన్ బౌలింగ్లోనే అవుటయ్యాడు. అయితే విదేశాల్లో వీళ్లిద్దరూ తలపడిన రెండుసార్లు కూడా అశ్విన్ విఫలమయ్యాడు. స్వదేశంలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో అశ్విన్ టాప్లో ఉన్నాడు. అతను 20.79 సగటుతో 191 వికెట్లు పడగొట్టాడు.
అతనొక్కడే కాదు, 21.31 సగటుతో 130 వికెట్లతో రెండో స్థానంలో రవీంద్ర జడేజా ఉన్నాడు. వీరితోపాటు ఇంగ్లండర్ పర్యటనలో మూడు మ్యాచ్లు ఆడి 27 వికెట్లు తీసిన అక్షర్ ఉండనే ఉన్నాడు. ఈ ముగ్గుర్నీ ఎదుర్కొంటూ భారీ స్కోర్లు చేయడం ప్రత్యర్థి బ్యాట్స్మెన్కు అతిపెద్ద సవాల్గా నిలుస్తుందనడంలో తప్పేమీలేదు.
మామూలుగా విదేశీ జట్లు నలుగురు పేసర్లు, ఒక పార్ట్టైం స్పిన్నర్తో రంగంలోకి దిగుతాయి. కానీ భారత్లో అలాంటి ప్రణాళిక పనిచేయడం కష్టం. భారత పర్యటనలో స్పిన్ కీలకం కానుందని కివీస్ వెటరన్ రాస్ టేలర్ కూడా ఇటీవల జరిగిన ప్రెస్మీట్లో ఒప్పుకున్నాడు. టెస్టులు ఆడే దేశాల్లో బంగ్లాదేశ్ (28.79) తర్వాత అత్యంత తక్కువ స్పిన్ యావరేజ్ భారత్దే (29.70). భారత బౌలర్లు కూడా తమ పరిస్థితులను చక్కగా ఉపయోగించుకోవడంలో ఉద్దండులు.
భారత బౌలింగ్ దళం సగటున 50 బంతులకు ఒక వికెట్ పడగొడుతోందని గణాంకాలు చెప్తున్నాయి. భారత్లో ఆడిన దేశాల్లో ఆస్ట్రేలియా (24.73) ఒక్కటే స్పిన్ బౌలింగ్లోనూ సత్తాచాటింది. అందుకని ఒక్క స్పిన్నరే సరిపోతారనుకుంటే అది పొరపాటే. 2017లో భారత్లో పర్యటించిన ఆస్ట్రేలియా కూడా నాథన్ లియాన్ (19 వికెట్లు), స్టీవ్ ఓకీఫె (19 వికెట్లు) ఉండబట్టే భారత్ను ఓడించినంత పనిచేసింది.
కొత్తబంతితో బౌలింగ్ చేసేటప్పుడు పేస్ బౌలింగ్ను మర్చిపోకూడదు. స్పిన్ ప్రధాన సమస్యే అయినా భారత్లో పేస్ ఎటాక్ కూడా బాగానే పనిచేస్తోంది. రాస్ టేలర్ కూడా ఇదే విషయం చెప్పాడు. ’ఇక్కడ స్పిన్ మాత్రమే కీలకపాత్ర పోషిస్తుందనుకుంటే మా అమాయకత్వమే అవుతుంది‘ అని టేలర్ అన్నాడు. కోహ్లీ శకంలో భారత్ వద్ద పేసర్లకు కొదవే లేకుండా పోయింది. ఈడెన్ గార్డెన్స్లో జరిగిన పింక్బాల్ టెస్టులో మొత్తం పది వికెట్లూ పేసర్ల ఖాతాలోనే పడిన సంగతి గుర్తుంది కదా.
భారత్ తరఫున ఉమేష్ యాదవ్ 78 వికెట్లతో హైయస్ట్ వికెట్ టేకర్గా నిలిచాడు. అయితే మహమ్మద్ షమీ (51 వికెట్లు)ని కూడా మర్చిపోకూడదు. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్లో అతను చాలా ప్రమాదకరంగా మారతాడు. రెండో ఇన్నింగ్స్లో అతని బౌలింగ్ యావరేజి 17.64 అంటేనే అతని బౌలింగ్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, మిగతా బౌలర్లతో పోల్చుకుంటే షమీ చేసినంతగా వికెట్లను మరే బౌలరూ టార్గెట్ చేయడని చెప్పొచ్చు.
ఇన్ని అంశాలు పరిగణనలోకి తీసుకుంటేగానీ టీమిండియాను భారత్లో ఓడించడం సాధ్యంకాదు. ‘ఇంత చేయడం ఎవరి వల్లా కాదు’ అనిపించడం నిజమే కానీ, స్వదేశంలో టీమిండియా సత్తాకు అది నిదర్శనం. ఇవన్నీ చేసి భారత్ను స్వదేశంలో ఓడిస్తే ప్రత్యర్థి జట్లకు వచ్చే మజా కూడా అంతే గొప్పగా ఉంటుందనడంలో కూడా సందేహం లేదు.