కివీస్తో జరుగుతున్న టెస్టు మ్యాచ్ మూడో రోజు టీమిండియా ఆధిపత్యం చెలాయించింది. న్యూజిల్యాండ్ జట్టును ఆలౌట్ చేసిన అనంతరం బ్యాటింగ్కు దిగిన భారత జట్టు.. వికెట్లేమీ కోల్పోకుండా రోజు ముగిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ బౌల్డ్ అయ్యాడు.
అతను అవుటవడం కన్నా అవుటైన విధానమే క్రికెట్ అభిమానులను నిరాశపరిచింది. ఇన్స్వింగ్ బంతిని ఆడలేకపోయిన గిల్.. వికెట్ సమర్పించుకున్నాడు. దీంతో నెటిజన్లు గిల్ను టార్గెట్ చేస్తూ విపరీతమైన విమర్శలు చేస్తున్నారు. ఇన్స్వింగ్ను ఆడలేకపోతున్నాడనే కారణంతో పృథ్వీ షాను సెలెక్టర్లు పక్కన పెట్టి, గిల్కు అవకాశం ఇస్తున్నారు.
అయితే అతను కూడా వరుసగా ఒకే రకమైన బంతులకు వికెట్ పోగొట్టుకుంటున్నాడు. స్పిన్ బౌలింగ్ను కూడా గిల్ సరిగా ఆడలేడని నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. అంతేకాదు, ఫామ్లో లేక ఇబ్బందులు పడుతున్న టీమిండియా వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాతో గిల్ను పోలుస్తూ ఎద్దేవా చేస్తున్నారు.
వీరిద్దరి సగటు ఒకేలా ఉందని, కానీ కేవలం సాహాను మాత్రమే జట్టుకు భారం అంటున్నారని కొందరు ట్వీట్లు చేశారు. వీళ్లిద్దరూ భారత జట్టుకు ఉపయోగపడటం లేదని విమర్శిస్తున్నారు.