పసికూన హాంగ్కాంగ్పై భారత జట్టు భారీ విజయం సాధించింది. దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు.. సూర్యకుమార్ యాదవ్ (68 నాటౌట్), విరాట్ కోహ్లీ (59 నాటౌట్) రాణించడంతో 192 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో హాంగ్ కాంగ్ కూడా తమ ఇన్నింగ్స్ ధాటిగానే ఆరంభించింది. పవర్ ప్లే ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 52 పరుగులు చేసింది. అయితే ఆ తర్వాత జడేజా, చాహల్ కట్టుదిట్టంగా బైలింగ్ చేయడంతో హాంగ్ కాంగ్ తడబడింది. చివరకు కోహ్లీ కూడా ఒక ఓవర్ వేశాడు.
అయితే యువ పేసర్లు ఆవేష్ ఖాన్ (53), అర్షదీప్ సింగ్ (44) భారీగా పరుగులు సమర్పించుకున్నారు. వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ మూడు ఓవర్లు వేసి కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చాడు. భారత సీనియర్లంతా కట్టుదిట్టంగా బంతులు వేయడంతో హాంగ్ కాంగ్ బ్యాటర్లు ఏం చెయ్యలేకపోయారు. నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 152 పరుగులు మాత్రమే చెయ్యగలిగారు. హాంగ్ కాంగ్ బ్యాటర్లలో బాబర్ హయత్ (41), కించిత్ షా (30), జీషన్ అలీ (26 నాటౌట్) రాణించారు. భారత బౌలర్లలో భువీ, జడేజా, ఆవేష్ ఖాన్, అర్షదీప్ సింగ్ తలో వికెట్ తీసుకున్నారు.