Rohit Sharma | స్వదేశంలో ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్లో ఓడినా వైజాగ్, రాజ్కోట్లలో మాత్రం విజయాలు సాధించింది. అయితే భారత్తో మ్యాచ్లు ఆడుతున్నప్పుడు గెలిస్తే తమ ఘనతగా ఓడిపోతే పిచ్ల మీద పడి ఏడ్చే విదేశీ మీడియాతో పాటు అక్కడి క్రికెట్ విశ్లేషకులు చేసే విమర్శలకు తాజాగా భారత జట్టు సారథి రోహిత్ శర్మ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. తమకు పిచ్తో సంబంధం లేదని, ఏ పిచ్మీద అయినా గెలిచే సత్తా తమకు ఉందని అన్నాడు. స్పిన్ పిచ్ల మీద అదరగొట్టే భారత్.. ఇటీవలే సౌతాఫ్రికా వేదికగా ఆ దేశంతో జరిగిన టెస్టు సిరీస్లో భాగంగా అత్యంత కఠినమైన కేప్టౌన్ పిచ్పై కూడా గెలిచి చూపించామని రోహిత్ అన్నాడు.
హైదరాబాద్ టెస్టులో భారత్ ఓడిపోయి వైజాగ్లో పుంజుకున్న తర్వాత పిచ్ల మీద చర్చ మరోసారి ముందుకొచ్చింది. స్వదేశంలో భారత్ స్పిన్, స్లో పిచ్లను ఉపయోగించాల్సిన పనిలేదని, టెస్టులలో మనకూ ప్రత్యర్థి జట్టును రెండుసార్లు ఆలౌట్ చేయగల బౌలర్లు ఉన్నారని ఇటీవల భారత మాజీ సారథి గంగూలీ కూడా వ్యాఖ్యానించాడు. రాజ్కోట్ టెస్టు ముగిశాక రోహిత్ ఈ చర్చమీద స్పందిస్తూ.. ‘భారత్లోనే గాక విదేశాలకు వెళ్లినప్పుడు కూడా మేం మ్యాచ్లను గెలుస్తున్నాం. భవిష్యత్లోనూ ఇది కొనసాగుతుంది. పిచ్ ఎలా ఉండాలన్నది మా చేతుల్లో లేని అంశం. మేం మ్యాచ్ జరగడానికి ముందు పిచ్ను చూస్తాం. దానిని బట్టి నిర్ణయాలు తీసుకుంటాం.. పిచ్ల తయారీ అంతా క్యూరేటర్ల చేతుల్లోనే ఉంటుంది. అందులో మేం జోక్యం చేసుకోం…
మాకు ఏ వికెట్ మీద అయినా ఆడి గెలిచే సామర్థ్యం ఉంది. ఇటీవలే సౌతాఫ్రికా పర్యటనలో కేప్టౌన్ పిచ్ ఎంత క్లిష్టంగా ఉందో అందరూ చూశారు. ఆ పిచ్పై కూడా మేం నెగ్గాం..’ అని అన్నాడు. ఇంగ్లండ్తో సిరీస్లో గత మూడు మ్యాచ్లలో తమకు భిన్న సవాళ్లు ఎదురయ్యాయని రోహిత్ చెప్పాడు. ‘హైదరాబాద్లో బంతి టర్న్ అయింది. వైజాగ్ వికెట్ స్లో గా ఉంది. రాజ్కోట్లో మూడు రోజుల పాటు పిచ్ ఒకే రకంగా స్పందించింది. కానీ నాలుగో రోజు మాత్రం కొద్దిగా టర్న్ దొరికింది. ఆ పిచ్ స్వభావాన్ని అర్థం చేసుకున్నాడు కాబట్టే జడ్డూ నాలుగో రోజు ఫైఫర్తో విజృంభించాడు.. మేం మాకు ఇవే పిచ్లు కావాలని పట్టుబట్టడం లేదు. ఒకవేళ మాకు స్పిన్ పిచ్లే ఇస్తే ఇంకా అద్భుత విజయాలు సాధిస్తాం..’ అని రోహిత్ తెలిపాడు.