IND vs ENG | ఇంగ్లండ్తో వైజాగ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఎంట్రీ ఇచ్చి ఆ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో కాస్త చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడిన టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ రజత్ పాటిదార్ ఆ తర్వాత వరుసగా ఐదు ఇన్నింగ్స్లలో డబుల్ డిజిట్ చేరడానికి నానా తంటాలు పడుతున్నాడు. దేశవాళీ క్రికెట్తో పాటు భారత్ ‘ఏ’కు ఆడిన క్రమంలో టన్నుల కొద్దీ పరగులు చేసి సెలక్టర్ల దృష్టిలో పడిన పాటిదార్.. జాతీయ జట్టులో మాత్రం ఆ మ్యాజిక్ను రిపీట్ చేయలేకపోతున్నాడు. వరుస వైఫల్యాలతో మూడు టెస్టులలో 63 పరుగులే చేసిన పాటిదార్ను ధర్మశాల టెస్టులో పక్కనబెట్టి దేవ్దత్ పడిక్కల్కు ఛాన్స్ ఇవ్వనున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్.. పాటిదార్కు మద్దతుగా నిలిచాడు.
డివిలియర్స్ తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా స్పందిస్తూ… ‘రజత్ పాటిదార్ ఈ సిరీస్ (ఇంగ్లండ్)లో లైఫ్ టైమ్ గుర్తుంచుకునే ఇన్నింగ్స్లు ఆడలేదు. కానీ ప్రస్తుతం భారత జట్టులో ఉన్న మంచి విషయం ఏంటంటే కొన్నిసార్లు మనం బాగా ఆడకున్నా ఫలితాలు జట్టుకు అనుకూలంగా వస్తున్నప్పుడు టీమ్లో కొనసాగొచ్చు. పాటిదార్ అటిట్యూడ్ బాగా ఉండి అతడి క్యారెక్టర్ డ్రెస్సింగ్ రూమ్లో అందరికీ నచ్చితే కెప్టెన్ రోహిత్ శర్మ అతడు టీమ్లో ఉండాలని సెలక్టర్లను కోరొచ్చు. ఈ కుర్రాడికి మంచి భవిష్యత్ ఉంది. ప్రస్తుతానికి అతడు పరుగులేమీ చేయకున్నా అతడికి మరిన్ని అవకాశాలిచ్చి చూడండి..’ అని అభిప్రాయపడ్డాడు.
ప్రస్తుతం భారత జట్టులో కుర్రాళ్లు అంచనాలకు మించి రాణిస్తున్నారని డివిలియర్స్ కొనియాడాడు. జట్టులోకి వచ్చే ఆటగాళ్లు పాజిటివ్ అటిట్యూడ్తో ఉన్నారని, వాళ్లకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారని మిస్టర్ 360 అన్నాడు. ఇదిలాఉండగా ఐదు మ్యాచ్ల సిరీస్ను ఇప్పటికే 3-1తో గెలుచుకున్న భారత్.. ఈనెల 7 నుంచి ధర్మశాల వేదికగా ఆఖరి టెస్టు ఆడనుంది. ఈనెల 2 తర్వాత భారత జట్టు ధర్మశాలకు వెళ్లే అవకాశముంది.