Ashwin – Bairstow | ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత పర్యటనలో ఉన్న ఇంగ్లండ్ ఇప్పటికే సిరీస్ను 1-3 తేడాతో కోల్పోయింది. ఇరుజట్ల మధ్య మార్చి 7 నుంచి ధర్మశాల వేదికగా ఆఖరి టెస్టు జరగాల్సి ఉంది. ఈ టెస్టులో అయినా గెలిచి పరువు దక్కించుకోవాలని ఇంగ్లండ్ భావిస్తుండగా 4-1 తేడాతో గెలవాలని భారత్ భావిస్తోంది. అయితే ఈ మ్యాచ్లో ఫలితం ఎలా ఉన్నా ధర్మశాల టెస్టుతో భారత క్రికెట్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్, ఇంగ్లండ్ మిడిలార్డర్ బ్యాటర్ జానీ బెయిర్ స్టోలు ఈ మ్యాచ్తో ‘సెంచరీ’ కొట్టబోతున్నారు. ఈ ఇద్దరికీ ఇది వందో టెస్టు కావడం గమనార్హం. కాగా, ఒక టెస్టులో ప్రత్యర్థి జట్ల ఆటగాళ్లు వందో మ్యాచ్లు ఆడుతుండటం 147 ఏండ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఇది మూడోసారి మాత్రమే.
అంతర్జాతీయ టెస్టు క్రికెట్ చరిత్రలో ఇలా ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు కలిసి వందో మ్యాచ్ ఆడిన సందర్భాలు రెండు ఉన్నాయి. ఇందులో మొదటిది 2006లో చోటు చేసుకుంది. 2005-06లో న్యూజిలాండ్ క్రికెట్ జట్టు సౌతాఫ్రికాలో పర్యటించింది. ఈ సిరీస్లో భాగంగా తొలి టెస్టులో కివీస్ దిగ్గజం స్టీఫెన్ ఫ్లెమింగ్ (ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ హెడ్కోచ్), దక్షిణాఫ్రికా లెజెండరీ పేసర్ షాన్ పొలాక్ కలిసి వందో టెస్టు ఆడారు.
2013లో రెండోసారి ఇలా జరిగింది. 2013-14లో ఇంగ్లండ్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించింది. ఈ పర్యటనలో భాగంగా జరిగిన ఐదో టెస్టులో ఇంగ్లండ్ బ్యాటర్ అలెస్టర్ కుక్, ఆసీస్ బ్యాటర్ మైఖెల్ క్లార్క్లు కలిసి వందో టెస్టు ఆడారు. ఇప్పుడు తాజాగా అశ్విన్ – బెయిర్ స్టోలు ఆడనుండటం మూడోసారి కావడం విశేషం. ఈ సిరీస్లో అశ్విన్ ఎప్పటిలాగే వికెట్ల వేట కొనసాగిస్తుండగా బెయిర్ స్టో మాత్రం దారుణంగా విఫలమవుతున్నాడు. తన వందో టెస్టులో అయినా బెయిర్ స్టో రాణించాలని ఇంగ్లండ్ క్రికెట్ ఫ్యాన్స్తో పాటు ఆ జట్టు హెడ్కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ కూడా కోరుకుంటున్నాడు.